హాజీపూర్, నవంబర్ 26 : జీపీఎస్ ద్వారా పోడు భూముల నిర్ధారణ చేయనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ల్యాండ్ సర్వేయర్లు, అటవీశాఖ అధికారులకు పోడు భూములపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆర్వోఎఫ్ఆర్-2005 చట్టం ప్రకారం పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28 వరకు పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లాలో 11 ,774 దరఖాస్తులు రాగా 33,418 ఎకరాల అటవీ భూమి సాగులో ఉందన్నారు. భూముల నిర్ధారణలో అటవీ అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. ఒక్క అంగుళం అటవీ భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. పోడు భూముల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. మండలాలు, గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్ల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లాలో 16 మంది సర్వేయర్లు, 95 బృందాలు పని చేస్తున్నాయన్నారు. బెల్లంపల్లి పరిధిలోని ఆకెనపెల్లి, నేతకాని గూడెంలో 1680 ఎకరాలు, దేవాపూర్, ధర్మరావుపేటలో 103 ఎకరాలు, కొర్మిచెల్మ, లంబాడితండా, మల్కపల్లిలో 154 ఎకరాలు, వెంకటాపూర్, బుగ్గగూడెం, ఆల్గంలో 591 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. హ్యాబిటేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను భూమి విస్తీర్ణంతో పాటు ఇతర వివరాలతో సమగ్రంగా నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 కన్నా ముందు పోగు సాగు చేసుకుంటున్న రైతులు అర్హులన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, అటవీశాఖల అధికారులు, ల్యాండ్ సర్వేయర్లు సంబధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని చాటుదాం
హాజీపూర్, నవంబర్ 26 : భారత రాజ్యాంగ స్ఫూర్తిని కలిసికట్టుగా చాటుదామని మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ మూడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా తన మేధస్సును ధారపోసి రచించిన రాజ్యాంగాన్ని దేశ పరిషత్కు అందించిన రోజు నవంబర్ 26 అన్నారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక, భారత సంవిధాన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి సురేశ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.