నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి
బర్కత్పుర కాలనీలో కార్డన్ సెర్చ్
పత్రాలు లేని వాహనాల సీజ్
నిర్మల్ అర్బన్, నవంబర్ 26 : శాంతి భద్రతల పరిరక్షణకే జిల్లాలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బర్కత్పుర కాలనీలో శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీసులు ఇంటింటా తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్లో ఉన్న చలానాలను వసూలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్డన్ సెర్చ్తో అనుమానిత వ్యక్తులు, నేరస్తులు దొరికిపోతారన్నారు. కాలనీలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 124 బైకులు, 3 కార్లు, 14 ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సోన్ సీఐ రాం నర్సింహారెడ్డి, రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
దస్తురాబాద్ పోలీస్స్టేషన్లో తనిఖీ..
దస్తురాబాద్, నవంబర్ 26 : దస్తురాబాద్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ ఉపేందర్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఎస్ఐ జ్యోతిమణికి పలు సూచనలు చేశారు. స్టేషన్కు వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, వారికి భరోసా కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, నిబంధనలపై వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్లోని వసతులను చూసి, ఎస్ఐ విధులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.