రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
స్వర్ణ ప్రాజెక్టులో 17 లక్షల చేపపిల్లల విడుదల
ఎస్సీ కార్పొరేషన్ చెక్కుల పంపిణీ
సారంగాపూర్, సెప్టెంబర్ 26 : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 17 లక్షల చేపపిల్లలను వదిలే కార్యక్రమానికి ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో వందశాతం సబ్సిడీ కింద చేపపిల్లలను అందించి వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారన్నారు. ఈ మత్స్య సంపదతో ఏడాది పొడవునా గంగపుత్రులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ఇవేకాకుండా మోపెడ్లు, ద్విచక్రవాహనాలు, ఫోర్వీలర్ వాహనాలు, వలలు, ఐస్పెట్టెలు ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. మత్స్యకారుల కోసం నిర్మల్లో రూ.1.50 కోట్లతో మత్స్యభవన్, భైంసా పట్టణంలో రూ.50 లక్షలతో ఫిష్ మార్కెట్లకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండాయని తెలిపారు. ప్రాజెక్టులో రొయ్యపిల్లలు వదలడంతో చేపలకు హాని చేస్తున్నాయని, గేట్లు వదిలినప్పుడు చాలా వరకు చేపలు బయటకు వెళ్లిపోతున్నాయని, అందుకే చేపలనే పంపిణీ చేయాలని మంత్రి దృష్టికి మత్స్యకారులు తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాసంగిలో ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనే పరిస్థితి లేదని, రైతులు ఆలోచించి ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఇన్చార్జి మత్స్యశాఖ ఏడీ ఆంజనేయస్వామి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, సర్పంచ్ ఆయేషాసిద్ధిఖీ, ఎంపీటీసీ భోజారెడ్డి, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, తహసీల్దార్ సంతోష్రెడ్డి, నాయకులు రాజ్మహ్మద్, నాగుల రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కండెల భోజన్న, సాయికృష్ణ, భూమేశ్, లక్ష్మీనారాయణ, ప్రసాద్, హాది, మల్లేశ్, దేవీశంకర్, టెంబరేణి భోజన్న, సాయన్న, రంకుల సాయన్న, పాకాల రాంచందర్, దత్తురాం, మత్స్యశాఖ కాంట్రాక్టర్ యువరాజ్, ఆయా గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు.
దళితబంధు పథకం దేశానికే ఆదర్శం..
నిర్మల్ టౌన్ / లక్ష్మణచాంద, సెప్టెంబర్ 26 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దళితులు ఆర్థికాభివృద్ధి చెందేలా చేపట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. జిల్లాలో మొత్తం 57 మందికి రూ.8.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హన్మండ్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.