థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు రంగంలోకి ఆరోగ్య బృందాలు
పంచాయతీ, ఐసీడీఎస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల భాగస్వామ్యం
జ్వర పీడితుల వివరాలపై ఆరా
పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసొలేషన్ కిట్లు ఇంటివద్దే టీకా..
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్ (నమస్తే తెలంగాణ), జనవరి 21 : కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర సర్కారు ముందస్తు వ్యూహానికి సిద్ధమైంది. థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి జ్వర సర్వేను ప్రారంభించింది. పంచాయతీ రాజ్, ఐసీడీఎస్, మున్సిపల్శాఖల భాగస్వా మ్యంతో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. పాజిటివ్ లక్షణాలున్నవారిని హోం ఐసొలేషన్ చేసి, అక్కడే మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నది. అత్యవసరమైతే దవాఖానలకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నది. ఆయా చోట్ల కలెక్టర్లు పర్యవేక్షించి సూచనలు చేశారు. కరోనా రెండో దశ నేపథ్యంలో చేపట్టిన ఫీవర్ సర్వే సత్ఫలితాలివ్వగా, నీతి ఆయోగ్ ప్రశంసలు అందించింది.
కరోనా మూడో దశ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే చేపట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో వైద్యబృందాలు గ్రామాల్లో రంగంలోకి దిగాయి. ఆరోగ్య సిబ్బందితో పాటు పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నది. ఫీవర్ సర్వే చేయడమే కాకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారిని హోం ఐసొలేషన్ చేసి, అక్కడే మెడికల్ కిట్లు అందిస్తున్నది. కరోనా రెండో దశ నేపథ్యంలో జ్వర సర్వే సత్ఫలితాలిచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన ఈ సర్వేను కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేసింది. నీతి ఆయోగ్, ఆర్థిక సర్వే కూడా ప్రశంసలు కురిపించింది. ఆదిలాబాద్లో 1100 బృందాలు, నిర్మల్లో 564 బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. ఆదిలా బాద్ జిల్లాలో జ్వర సర్వేను ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నా యక్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ , నిర్మల్లో కలెక్టర్ ముషారఫ్ అ లీ ఫారూఖీ పర్యవేక్షించారు.
తగ్గిన పాజిటివ్ కేసులు..
జ్వర సర్వేలో భాగంగా కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులు పంపిణీ చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. బాధితులు వ్యాధి ముదిరిన తర్వాత దవాఖానలకు వచ్చి ఇబ్బంది పడేవారు. జ్వర సర్వేతో ప్రాథమిక దశలోనే లక్షణాలు ఉన్నవారికి సకాలంలో చికిత్స అందింది. దవాఖానలకు వెళ్లాల్సిన తిప్పలు తప్పడంతో ఆర్థికంగానూ వెసులుబాటు అయ్యింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేయించిన సర్వేతో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ సర్వే దేశానికి ఆదర్శంగా నిలువడంతో కేంద్రం ఇతర రాష్ర్టాల్లోనూ దీన్ని అమలు చేసింది. రాష్ట్రంలో ఫీవర్ సర్వే సక్సెస్ కావడంతో ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని సూచించారు. కొవిడ్ కట్టడికి అమలు చేసిన జ్వర సర్వే విధానాన్ని వివరిస్తూ నీతి ఆయోగ్, ఆర్థిక సర్వే కూడా ప్రశంసలు కురిపించింది. ‘బెస్ట్ ప్రాక్టీస్”గా నీతి ఆయోగ్ అభివర్ణించింది. సర్వే ఫలితంగా కరోనా వ్యాప్తిని ప్రాథమిక దశలోనే కట్టడి చేయగలిగారని ప్రశంసించింది. దీంతో దవాఖానలో చేరికలను, వైద్య వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించవచ్చని నిరూపించిందని అభినందించింది.
ప్రాథమిక దశలోనే నివారణ..
ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేతో బాధితులకు ప్రాథమిక దశలో చికిత్స అందనున్నది. కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నా చాలా మంది వ్యాధి లక్షణాలు ఉన్నవారు ప్రారంభంలో పరీక్షలు చేయించుకోవడం, చికిత్స తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. వైరస్ ప్రభావం ఎక్కువై ఛాతిలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో దవాఖానలకు వస్తున్నారు. దీంతో వ్యాధికి చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. స్క్రీనింగ్ సర్వేతో వ్యాధి ప్రాథమిక దశలోనే నయం కావడంతో పాటు తగ్గిన వారికి మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
ఆదిలాబాద్లో..
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం జ్వర సర్వేను చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1100 వైద్య బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి టీంలో ఏఎన్ఎంలు, ఆశ, పంచాయతీ, అంగన్వాడీ, మెప్మా, ఐకేపీ సిబ్బంది ఉంటారు. వీరు గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటా కుటంబసభ్యులు అరోగ్యపరమైన సమస్యలను తెలుసుకుంటారు. జర్వం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వైద్య చికిత్సలు అందిస్తారు. మందులు ఎలా వేసుకోవాలనే విషయాలను వైద్య సిబ్బంది తెలియజేస్తారు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటే మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలిస్తారు. కాగా, శుక్రవారం ఆదిలాబాద్లో 29, 977 ఇండ్లలో సర్వే నిర్వహించగా, అందులో 706 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. వారికి కిట్లు పంపిణీ చేశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 500 బృందాలు, పట్టణ ప్రాం తాల్లో 64 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. అ న్ని శాఖల సమన్వయంతో ప్రతి బృందం రోజుకు 25 ఇళ్లను సర్వే చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 25వేల ఇళ్లను సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో కొవిడ్ రెండవ దశలో కూడా ఇంటింటా సర్వే చేపట్టడం వల్ల కొవిడ్ వ్యాప్తిని అరికట్టగలిగారు. ఈసారి వైద్య ఆరోగ్య శాఖ ముం దుగానే అప్రమత్తం కావడం వల్ల మూడో దశ వ్యాప్తిని కట్టడి చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ సర్వే ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించ డంతో పాటు ఎవరైనా వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోని వారు ఉంటే వారిని గుర్తించి వెంటనే టీకా వేసే అవకా శం కలుగుతుంది. అలాగే అవసరమైన వారికి బూస్టర్ డోసు టీకాను వేయించి కరోనా వ్యాప్తిని నియంత్రిం చవచ్చని అంటున్నారు. నిర్మల్ జిల్లాలో సర్వేను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యవేక్షించారు.
వివరాలు నమోదు చేసుకుంటున్నాం..
ఎదులాపురం, జనవరి 21: ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నాం. ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నాం. ఈ సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందజేస్తున్నాం. వ్యాధి తీవ్రత ప్రాథమిక దశలోనే తగ్గేలా చూస్తున్నాం. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ జ్వర సర్వే మంచి ఫలితాలనే ఇస్తున్నది. చాలా కుటుంబాల్లో జ్వర లక్షణాలు కనిపించడం లేదు.