నేడు మద్యం దుకాణాలకు డ్రా తీయనున్న కలెక్టర్లు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
భారీగా దరఖాస్తులు
ఆశావహుల్లో ఉత్కంఠ
నిర్మల్ అర్బన్, నవంబర్ 19 : నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు అధికారులు స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. నిర్మల్, భైంసా ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని దుకాలణాలకు రాత్రి వరకు 556 దరఖాస్తులు వచ్చాయి. నిర్మల్ ఎక్సైజ్ పరిధిలోని 11 మండలాల్లోని 29 మద్యం షాపులకు 406 దరఖాస్తులు రాగా.. భైంసా ఎక్సైజ్ పరిధిలోని ఎనిమిది మండలాల్లోని 18 దుకాణాలకు 150 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణకు గతేడాది కంటే ఈసారి లైసెన్స్ ఫీజు చెల్లింపునకు అవకాశాలు పెంచడం, జిల్లాలో అదనంగా 10 వైన్స్లను ఏర్పాటు చేయడం, ఎస్సీ, గౌడ కులస్తులకు దుకాణాల కేటాయింపులో రిజర్వ్ చేయడంతో అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో గతేడాది 475 దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 556 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా నిర్మల్లోని 10వ నంబర్ దుకాణానికి 35 దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా 41, 43వ నంబర్ నర్సాపూర్(జీ), సిర్గాపూర్ వైన్స్లకు నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. శనివారం లక్కీడ్రా తీయనున్నారు. పట్టణంలోని విశ్వనాథ్పేట్ కాలనీలోని స్టార్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 11 గంటలకు లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభం కానుంది. మద్యం దుకాణాలకు దరఖాస్తులు సమర్పించినప్పుడు ఎంట్రీ పాసులను ఎక్సైజ్ అధికారులు జారీ చేశారు. వాటి ఆధారంగా ఒక్కో దరఖాస్తుకు ఒక్కరిని మాత్రమే అధికారులు లోనికి అనుమతిస్తారు. లక్కీడ్రాకు హాజరయ్యే వారు ఎంట్రీ పాసులు తప్పకుండా వెంటతెచ్చుకోవాలి. దరఖాస్తుదారులతో పాటు కొంతమంది ఆశావహులు గ్రూపుగా కలిసి దరఖాస్తులు వేయంతో పెద్దసంఖ్యలో ప్రజలు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రెండేండ్ల పాటు విక్రయాలు..
లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రభుత్వం సూచించిన స్లాబ్ ప్రకారం ఫీజు చెల్లించి రెండేండ్ల పాటు విక్రయాలు చేసుకోవచ్చు. మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ కంటే అధిక రేటుకు విక్రయించినా, కల్తీ చేసినా లైసెన్స్ రద్దయ్యే అవకాశాలున్నాయి. కాగా.. జిల్లా వ్యాప్తంగా 47 మద్యం దుకాణాలకు 556 దరఖాస్తు రాగా.. ఒక్కో దానికి రూ.2 లక్షల రుసుముతో మొత్తం రూ.11.12 కోట్ల ఆదాయం సమకూరింది.
ఆరేండ్లలోనే రెండింతలు..
మద్యం దుకాణాలకు 2015 సంవత్సరంతో పోల్చితే రెండింతల దరఖాస్తులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2015లో 36 మద్యం దుకాణాలకు 241 దరఖాస్తులు రాగా.. రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చింది. 2017లో 37 మద్యం దుకాణాలకు 434 రాగా.. రూ.4.34 కోట్లు, 2019లో 37 మద్యం దుకాణాలకు 475 దరఖాస్తులకు రూ.9.50 కోట్లు, 2021లో 47 మద్యం దుకాణాలకు 556 దరఖాస్తులు.. రూ.11.12 కోట్ల ఆదాయం వచ్చింది.