ఎదులాపురం, నవంబర్ 19 : అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. జిల్లా హెడ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పోలీసు అధికారులతో శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలపై నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఐలు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల జరిగిన ప్రధాన నేరాలపై పోలీస్ అధికారులతో చర్చించి వివరణ తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తుపై కీలకమైన సూచనలు చేశారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడానికి ప్రత్యేక అధికారుల నియామకం సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో పది రోజులుగా ఆర్థిక నేరాలు నమోదు కాలేదని చెప్పారు. గంజాయి నిల్వలు, రవాణా వ్యవస్థ కట్టడికి డీఎస్పీ, ఇద్దరు ఎస్ఐలతో సహా 10 మంది ప్రత్యేక బృందం జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గుండాల గ్రామం జంట హత్యకేసులో పరారైన నిందితుల కోసం ఇద్దరు ఎస్ఐలతో ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు కొనసాగించాలన్నారు.
పోలీస్ స్టేషన్లో బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించడానికి 24 గంటలు అధికారుల హాజరు ఉండాలన్నారు. ఫంక్షనల్ ఆర్టికల్స్ విధానంతో రోజు వారీ విధులను విభజించి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు.బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించే రిసెప్షన్ వర్టికల్స్ నుంచి దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో తుదినివేదిక సమర్పించే వరకు 13 వర్టికల్స్ విభాగాల బాధ్యతలు నిర్వహించి ఉన్నతమైన ప్రతిభ కనబర్చాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఇచ్చే సేవ, ఉత్తమ సేవ, మహోన్నత సేవ, శౌర్య తదితర పథకాలన్నీ ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలు, చిన్నారులు, భద్రత రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. వీరి రక్షణ కోసం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మూడు షీటీం బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఎస్.శ్రీనివాసరావు, సీ సమయ్ జాన్రావు, బీ వినోద్ కుమార్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఎం విజయ్ కుమార్, పోలీస్ కార్యాలయం పరిపాలనాధికారి మహ్మద్ యూనుస్ అలీ, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, సీఐలు పోతారం శ్రీనివాస్, కే పురుషోత్తంచారి, ఎస్ రామకృష్ణ, వై రమేశ్బాబు, గుమ్మడి మల్లేశ్, కే ఫణిధర్, ఎస్ఐలు పాల్గొన్నారు.