కాసిపేట, అక్టోబర్ 13 : సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకొని కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పేంచేందుకు కృషి చేస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం సోమగూడెం భరత్ కాలనీ శిశు మందిర్ క్రీడా మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా లైటింగ్ సిస్టంను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కొరకొప్పుల ప్రమీలాగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణికి అవసరం లేని భూములను ప్రభుత్వానికి ఇస్తున్నారని, ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. కోల్ బెల్ట్ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి ప్రాంతంతో అన్ని సింగరేణి ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి, సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకువెళ్లి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇండ్ల పట్టాలు జాబితా ప్రకారం టెక్నికల్గా చూసి పరిష్కరిస్తామని చెప్పారు. గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, మినీ ఫంక్షన్ హాల్లో మరమ్మతులు చేయించాలని విన్నవించారు. సివిల్ వర్క్స్ చేయాలని జీఎంకు సూచించగా ఆయన సానుకూలంగా స్పందించారు. డ్రెస్ రూం, బాత్ రూములను ఏర్పాటు చేయిస్తామన్నారు.
సోమగూడెం సింగరేణి కాలనీలో నీళ్ల సమస్యపై సింగరేణి కార్మిక కుటుంబాలు విన్నవించగా పరిష్కరిస్తామన్నారు. అనంతరం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మిక ప్రాంతంలో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలన్నారు. వాకర్స్, క్రీడాకారుల కోసం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సింగరేణి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏజెంట్ కుర్మ రాజేందర్, సోమగూడెం(బి) సర్పంచ్ కొరకొప్పుల ప్రమీలాగౌడ్, సోమగూడెం(కె) సర్పంచ్ సపాట్ శంకర్, కార్యదర్శి లక్ష్మణ్, భీమాగౌడ్, జాడి ప్రమీల, వివేక్, మాజీ ఎంపీటీసీ దుర్గం లక్ష్మి, జాడి శివ, రంగు రవి తేజ, బైరగోని సిద్ధయ్య, దుగుట శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, జిల్లాల రాజేందర్, మాడ గోపాల్, దుర్గం గోపాల్, మేడ సమ్మయ్య, అడప పాపయ్య, కుక్క రాంచందర్, చీమల శైలజ, ఐకేపీ సీసీ రామకృష్ణ, వీవోఏ పేరాల మహేశ్ పాల్గొన్నారు.