జోడెఘాట్లో అన్ని ఏర్పాట్లు చేయాలి
తాగునీరు, భోజన వసతి కల్పించాలి
రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలి
హట్టి నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తాం
కొవిడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు
అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాహుల్రాజ్, పీవో భవేశ్ మిశ్రా
కెరమెరి, అక్టోబర్ 11: ఈ నెల 20న నిర్వహించే భీం వర్ధంతిని పండుగలా నిర్వహించుకుందామని కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. ఎస్పీ సుధీంద్ర, డీఎఫ్వో శాంతారాం, భీం మనవడు సోనేరావ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పెందోర్ రాముతో కలిసి జోడెఘాట్ గ్రామంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలను నుంచి సైతం ప్రజలు వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జోడెఘాట్లో ఏర్పాట్లు చేయాలన్నారు. కొవిడ్ నేపథ్యంలో దర్బార్ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలని సూచించారు. తాగునీరు, భోజన వసతి కల్పించాలని సూచించారు. అవ్వల్పేన్ షెడ్ నిర్మాణం, ఇతర మరమ్మతుల పనులు ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హట్టి నుంచి జోడెఘాట్ వరకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్పీ సుధీంద్ర మాట్లాడుతూ భోజన స్థలం, వీఐపీ, ఆర్టీసీ, ఇతర ప్రైవేట్ వాహనాల పార్కింగ్ వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని , ఎలాంటి సమస్యలు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీటీడీవో మణెమ్మ, డీఎంహెచ్వో మనోహర్, సీఐ సుధాకర్, తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్, ఎంపీడీవో దత్తారాం, ఎస్ఐ రమేశ్ ఆయా శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ నాయకులు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.