నిర్మల్ టౌన్, నవంబర్ 8 : ఈ నెల 14 వరకు జిల్లాలో బాలల దినోత్సవ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బాలల దినోత్సవ వారోత్సవాలపై సోమవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వారం పాటు జిల్లాలో బాలల హక్కులపై చైతన్యం కలిగించేలా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో బాలలకు పోషకాహారం, బాలల పరిరక్షణ అందరికీ విద్య, తదితర అంశాలపై అవగాహన పెంచాలని సూచించారు. ప్రతి గ్రామంలో క్రీడలు నిర్వహించి పెద్ద ఎత్తున పిల్లలు పాల్గొనేలా చూడాలన్నారు. ముథోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించే బాలల వారోత్సవాలకు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఆడపిల్లలకు వారి రక్షణపై అవగాహన పెంచాలని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఐసీడీఎస్ ద్వారా బాలలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ఆటల పోటీలతో పాటు ముగ్గుల పోటీలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, బాలల సంరక్షణ సమితి చైర్మన్ వాహిద్, జిల్లా చైల్డ్ రక్షణ అధికారి మురళి, జిల్లా శిశుసంక్షేమశాఖ అభివృద్ధి అధికారి స్రవంతి, అధికారులు నాగమణి, రాజు, మమత, శ్రావణి పాల్గొన్నారు.