వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న నది
అన్నారం బ్యారేజ్ 60 గేట్లు ఎత్తివేత
పలు మండలాల్లో పంటలు నీటిపాలు
చెన్నూర్/చెన్నూర్రూరల్/కోటపల్లి/జైపూర్, సెప్టెంబర్ 8: ఎగువ ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. దీంతో చెన్నూర్ పట్టణ సమీపంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరికి ఇరువైపులా ఒడ్లపై నుంచి వరద ప్రవహిస్తుంది. చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని చేన్లు నీట మునిగాయి. నియోజకవర్గంలో దాదాపు 5,333 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖధికారులు అంచనా వేశారు. బుధవారం ఉదయమే అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నష్ట పోయిన పంటల వివరాలను సేకరించారు. వరద తగ్గిన తర్వాత పంటల రక్షణ కోసం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. చెన్నూర్ మండలంలో 2,800ఎకరాల్లో పత్తి, 400 ఎకరాల్లో వరి, 350 ఎకరాల్లో మిర్చికి నష్టం వాటిల్లింది. కోటపల్లి మండలంలో 1,430 ఎకరాల్లో పత్తి, 40 ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో మిర్చి, మొత్తం 1500 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగింది. జైపూర్ మండలంలో 78 ఎకరాల్లో పత్తి, 247ఎకరాల్లో వరి, 8 ఎకరాల్లో మిర్చి, మొత్తం 333ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నివేదికలను మండల వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి పంపించారు. సుమారు వారం రోజల నుంచే రైతులు మిర్చి పంట నాటడం మొదలు పెట్టారు. 1995లో గోదావరికి వరదలు వచ్చాయని, ఆ తర్వాత ఇప్పుడేనని రైతులు తెలిపారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు అన్నారం బ్యారేజ్ నిండు కుండలా మారగా, మంగళవారం రాత్రి నుంచి 60 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. అన్నారం బ్యాక్ వాటర్తో చెన్నూర్,కోటపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోని పంటలు నీట మునిగాయి. చెన్నూర్ మండలంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్ రెడ్డి, కోటపల్లి మండలంలో ఏవో మహేందర్ రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న, సర్పంచ్లు పిల్లి భారతి, గుర్రం లక్ష్మి, రమేశ్, ఎంపీటీసీ సంగీత, ఏఈవో శేఖర్, టీఆర్ఎస్వై అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, నాయ లు పిల్లి సమ్మయ్య, పడాల శ్రీనివాస్, గుర్రం సమ్మయ్య ఉన్నారు. జైపూర్ మండలంలో దెబ్బతిన్న పంటలను జడ్పీ టీసీ మేడి సునీత, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పరిశీలించారు.