ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు
ప్రతి సెంటర్లో వైద్యుడు, సిబ్బంది
మెరుగైన సేవలు అందించడమే సర్కారు లక్ష్యం
ఆదిలాబాద్, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె చెంతనే మెరుగైన వైద్యాన్ని అందించాలని సర్కారు సంకల్పించింది. ఈ మేరకు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), సబ్ సెంటర్ల ద్వారా గ్రామీణులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నది. కరోనా పరీక్షలు, ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నది. గర్భిణులకు స్కానింగ్ నిర్వహించడంతోపాటు ప్రసవాలు కూడా చేస్తున్నది. ఫలితంగా పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 101 పీహెచ్సీలు ఉండగా.. 461 ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 71 సబ్ సెంటర్స్ను వెల్నెస్ సెంటర్లుగా మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యుడితోపాటు సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తారు.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో కరోనాకు సైతం పీహెచ్సీల్లో వైద్యం అందిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, కొవిడ్ ఓపీ, వ్యాక్సినేషన్, కిట్లను పంపిణీ చేస్తున్నారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు స్కానింగ్తో పాటు ప్రసవాలు చేస్తున్నారు. పలు సర్కారు దవాఖానల్లో 24 గంటల పాటు వైద్య సేవలను అందిస్తున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్ల నియామకంతో పాటు అవసరమున్న మందులను అందుబాటులో ఉంచుతుంది. జిల్లాలో పేదలకు అందుతున్న మెరుగైన వైద్య సేవలకు గాను గతంలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, దంతన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందగా, ఇటీవల బజార్హత్నూర్ పీహెచ్ని కూడా కేంద్రం గుర్తించింది.
ఉమ్మడి జిల్లాలో 71 వెల్నెస్ సెంటర్లు
ఉమ్మడి జిల్లాలో 461 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తారు. ఇందులో నుంచి 71 ఉప కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 18, నిర్మల్లో 18, మంచిర్యాలలో 18, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 17 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యుడితో పాటు ఇతర సిబ్బంది ఉంటారు. ఇప్పటికే అధికారులు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో 8 మందిని నియమించగా, మిగితా జిల్లాల్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉన్న సబ్ సెంటర్లలో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వైద్యులు సందర్శిస్తుంటారు. ఏఎన్ఎంలు ఉంటూ సబ్సెంటర్లకు వచ్చే వారికి వైద్యం అందిస్తారు. వెల్నెస్ సెంటర్లో వైద్యుడితో పాటు ఇతర సిబ్బంది ఉంటారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
8 మంది కమ్యూనిటీ అధికారులను నియమించాం..
జిల్లాలో 18 ప్రాథమిక ఉప కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే 8 మంది కమ్యూనిటీ హెల్ ఆఫీసర్లను నియమించినం. వీరికి త్వరలో శిక్షణ ఇప్పిస్తాం. వెల్నెస్ సెంటర్ర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందే అన్ని వైద్య సేవలు అందుతాయి. ఇకనుంచి ప్రజలు తమ గ్రామాల్లోనే మెరుగైన వైద్యసేవలు పొందే అవకాశం లభిస్తుంది.