వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే ‘దళిత బంధు’
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
లక్ష్మణచాంద, నిర్మల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
నిర్మల్ అర్బన్, ఆగస్టు 6 : టీఆర్ఎస్తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణంలోని మినీ ట్యాంకు బండ్పై శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు పాలాభిషేకం చేశారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమన్నారు. దళితుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, ఎస్పీ రాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు అప్పాల వంశీ, ముడుసు సత్యనారాయణ, నాయకులు, దళితులు, తదితరులు పాల్గొన్నారు.
పేద కుటుంబాలకు సర్కారు అండ
నిర్మల్ టౌన్, ఆగస్టు 6 : ఆడబిడ్డల పెండ్లిలు చేసి అప్పుల పాలవుతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఒక్కొక్కరికి రూ.1,0116 చెక్కులను అందిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలకు మంజూరైన చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. మొత్తం 108 మందికి రూ.1,07,87,528 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ జాకీర్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.