కేంద్రం వడ్లు కొనేందుకు సుముఖంగా లేదు
రైతులకు రాష్ట్ర ప్రభుత్వ భరోసా
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
రాచాపూర్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం
లక్ష్మణచాంద, నవంబర్ 5 : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వరికి బదులుగా ఆయిల్ పాం సాగుచేయాలని, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. మండలంలోని రాచాపూర్లో శుక్రవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. ప్రస్తుతం దొడ్డు రకం ధాన్యానికి డిమాండ్ పడిపోవడంతో గోదాముల్లో నిల్వలు పెరిగిపోయాయని, దీంతో ఎఫ్సీఐ కొనుగోలు చేయడంలేదని తెలిపారు. కానీ, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఈ యేడాది వానకాలం పంటను కొనుగోలుచేసేందుకు ఒప్పుకున్నదన్నారు. భవిష్యత్లో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేందుకు సుముఖంగా లేనందున సాగు తగ్గించడం మంచిదని సూచించారు. వరికి బదులుగా ఆయిల్ పాం సాగుచేయాలన్నారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సాగుచేస్తున్న ఆయిల్ పాం క్షేత్రాలను ఇక్కడి రైతులు పరిశీలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రఘునందన్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, సర్పంచ్ సాతం బొర్వవ్వ, ఎంపీటీసీ బూసి రమ, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ కవితారెడ్డి, నాయకులు వికాస్ రెడ్డి, అడ్వాల రమేశ్, సాతం గంగారాం తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు..
నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం నిర్వహించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను మంత్రి అల్లోల శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని, ఉమ్మడి జిల్లా ప్రజలపై యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేశామన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ జీవన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
బంగారు తాపడం కోసం విరాళాలివ్వండి..
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ప్రజలు విరాళాలు అందించాలని కోరారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలునుకునే భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వవచ్చని సూచించారు.