పెంచికల్పేట్, నవంబర్ 5 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్-బెజ్జూర్ ప్రధాన రహదారిపై బొక్కివాగు వంతెన సమీపంలో శుక్రవారం పెద్ద పులి కనిపించడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. శుక్రవారం పెంచికల్పేట్ వారసంత కావడంతో చుట్టు పక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో కొందరికి బొక్కివాగు వంతెన సమీపంలో పెద్ద పులి కనిపించింది. దీంతో ప్రయాణికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. రహదారికి ఇరువైపులా వాహనాలు అరగంట సేపు నిలిచిపోయి ఉన్నాయి. వాహనాల శబ్ధాలు, ప్రయాణికుల కేకలతో పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విషయమై అటవీ అధికారులను వివరణ కోరగా పెద్దపులి సంచారం వాస్తవమేనని తెలిపారు.
సొనాలలో పులి సంచారం
బోథ్, నవంబర్ 5: మండలంలోని సొనాల ప్రాంతంలో పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లిన కొంతమందికి వాగు వంతెన వద్ద పులి కనిపించిందని పుకార్లు వచ్చాయి. సాకెర శివారు ప్రాం తం నుంచి సొనాల వైపు పులి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వంతెన సమీపంలోని చుట్టు పక్కల పొలాలను పరిశీలించారు. పులి అడుగులను గుర్తించి మార్కింగ్ చేశారు. చిరు త పులి అయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం వైపు నుంచి చిరుత పులుల సం చారం పెరిగిందని బోథ్ మండలం మీదుగా కవ్వాల్ అభయారణ్యం వైపు వెళ్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.