నెలాఖరుకల్లా అందుబాటులోకి 219 మెగావాట్ల సౌర విద్యుత్
ఆదర్శ కేంద్రంగా ఎస్టీపీపీ
సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్
పవర్ ప్లాంట్పై సమీక్ష
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 2: సింగరేణి వ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి నీటిపై తేలియాడే 15 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నీటి రిజర్వాయర్పై ఏర్పాటు చేయాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. తొలి విడుతగా 5 మెగావాట్ల ప్లాంట్ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ విభాగాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముడు దశల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పాదన ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. మొదటి దశలో మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్(రాముగుమడం-3), రెండో దశలో మిగిలి ఉన్న కొత్తగూడెంలోని 37 మెగావాట్ల ప్లాంట్ను ఈ నెలాఖరుకల్లా ప్రారంభించాలనాన్నరు. సింగరేణి సోలార్ 219 మెగావాట్ల సామర్థానికి చేరుకోవాలని సూచించారు. కరీంనగర్లోని దిగువ మానేరు జలాశయంపై నిర్మించ తలపెట్టిన 250 మెగావాట్ల(డీసీ)ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నిర్మాణం ఏజెన్సీ ఎంపికకు సంబంధించిన టెండర్ నియమ నిబంధనలను డిసెంబరు లోగా రూపొందించాలన్నారు. ప్రభుత్వ అనుమతుల అనంతరం మార్చిలో టెండర్లు పిలవడానికి సిద్ధమై ఉండాలని కోరారు.
దేశానికే ఆదర్శ కేంద్రం కావాలి
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది దేశంలోని అత్యుత్తమ విద్యుత్ కేంద్రాల్లో ఏడో స్థానం సాధించడంపై సీఅండ్ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. రికార్డు స్థాయిలో ఓవర్ హోలింగ్ పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. రానున్న 8 నెలల కాలంలో 93 నుంచి 94 శాతం పీఎల్ఫ్తో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలన్నారు. దేశంలో అత్యుత్తమ 25 ప్లాంట్లలో మొదటి 5 స్థానాల్లో నిలిచేలా కృషి చేయాలని కోరారు. డైరెక్టర్(ఈఅండ్ఎం) డీ సత్యనారాయణరావు, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్కుమార్ ష్యూర్, చీఫ్(ఓఅండ్ఎం) జేఎన్ సింగ్, జీఎం (ఎస్టీపీపీ) జేవీపీ శాస్త్రి, జీఎం (సోలార్) డీవీఎస్ఎన్ రాజు, చీఫ్ కోఆర్డినేటర్, సోలార్ కన్సల్టెంట్ మురళీధరన్ ఎస్వో(పవర్) ఎన్వీకేవీ రాజు, ఏజీఎం (ఈఅండ్ఎం) పీసీ బస్విరెడ్డి, ఏజీఎం(ఫైనాన్స్) సీహెచ్ మురళీధర్, డీజీఎం(సివిల్) రవికుమార్ పాల్గొన్నారు.