అన్నదాతల పక్షాన పార్లమెంట్లో పోరాటం భేష్
మీ నిరసనతోనైనా కేంద్రం వెనక్కి తగ్గాల్సిందే
యాసంగి వడ్లు కొనాల్సిందే..
మా పూర్తి మద్దతు మీకే
స్థానిక బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు
గల్లీలో మాట్లాడుడే తప్పా ఢిల్లీలో గళమెత్తిందిలేదు
టీఆర్ఎస్ ఎంపీల ధర్నా సందర్భంగా ఉమ్మడి జిల్లా రైతులు, నాయకుల అభిప్రాయం
ఆదిలాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనేది లేదంటున్న కేంద్రంపై పార్లమెంట్లో కొట్లాటకు దిగిన టీఆర్ఎస్ ఎంపీలకు ఉమ్మడి జిల్లా రైతులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నరు. సీఎం కేసీఆర్ అప్పుడెట్లయితే తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిండో.. ఇప్పుడు రైతాంగం కోసం పార్లమెంట్ సాక్షిగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడడంపై హర్షం వ్యక్తం చేస్తున్నరు. టీఆర్ఎస్ ఎంపీల నిరసనలతోనైనా కేంద్రానికి కనువిప్పు కలగాలని, లేదంటే రణం తప్పదని హెచ్చరిస్తున్నరు. వారి ఆందోళనలకు జై కొడుతూనే, అక్కడే ఉన్నా ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలపై మండిపడుతున్నరు. ఇక అసలు ఆట మొదలైందని.. కేంద్రం దిమ్మ తిరగడం ఖాయమని, ఎలాగైనా దిగిరాక తప్పదని స్పష్టం చేస్తున్నరు.
తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షను చూపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో తెచ్చిన సంస్కరణలు, కల్పించిన సదుపాయాల కారణంగా మూడేళ్లుగా దిగుబడులు గణనీయంగా పెరిగాయి. 24 గంటల విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి, రైతుబంధు వంటి పథకాలు, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్న కారణంగా రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచారు. వరి దిగుబడి విపరీతంగా పెరిగింది. దీంతో యాసంగిలో పారాబాయిల్డ్ బియ్యాన్ని కొనబోమని కేంద్రం మెలిక పెట్టింది. కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులను కలిసి యాసంగి బియ్యం కొనకుంటే రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి చూశారు. మంత్రుల బృందం కూడా అనేక సార్లు వెళ్లి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర వైఖరిలో మార్పు లేదు సరికదా రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇందుకు విరుద్ధంగా యాసంగిలో వరి వేయాలని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కేంద్రం కొనమనడం, రాష్ట్ర బీజేపీ వరి నాట్లు వేయాలని చెప్పడంతో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి హైదరాబాద్లో ధర్నాకు దిగి కేంద్ర వైఖరిని నిలదీశారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదు.
పార్లమెంట్లో ఎంపీల ఆందోళన..
కేంద్రం అనుసరిస్తున్న విధానాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్లమెంట్లో అడుగుపెట్టిన టీఆర్ఎస్ ఎంపీలు శీతాకాల సమావేశాలను రెండ్రోజులుగా స్తంభింపజేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభలను నిర్వహించకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టమైన విధానాలతో చేపడుతున్న ఆందోళనకు ఇతర పార్టీల ఎంపీలు కూడా మద్దతు ఇస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల నిర్వహణ బీజేపీకి గండంగా మారింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. తమ డిమాండ్లను ఒప్పుకునే దాకా తమ వైఖరి ఇలాగే కొనసాగుతుందని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. పంజాబ్లాగే యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో జాతీయ స్థాయిలో స్పష్టమైన విధానాన్ని తేవాలని, ఎమ్మెస్పీ ధరలను చట్టబద్ధం చేయాలని. నల్ల చట్టాల రద్దును కోరుతూ ఏడాది పాటు ఆందోళన జరిగిన సమయంలో మృతిచెందిన రైతు కుటుంబాలను రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
ఎంపీలకు జిల్లా రైతు మద్దతు..
పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు చేపడుతున్న ఆందోళనకు జిల్లా రైతులు మద్దతుగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలతో దేశంలోని ఏ రైతు సంతోషంగా లేడని స్పష్టం చేస్తున్నారు. రైతు ఉద్యమాలకు జడిసి మూడు నల్ల చట్టాలను రద్దు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికీ ఎమ్మెస్పీ విషయంలో స్పష్టత ఇవ్వక పోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎమ్మెస్పీని చట్ట బద్ధం చేయాలనే టీఆర్ఎస్ డిమాండ్కు జిల్లా రైతులు మద్దతు పలుకుతున్నారు. టీఆర్ఎస్ అవలంబిస్తున్న ఉద్యమ స్ఫూర్తికి తామంతా అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకించి యాసంగిలో ప్రతి గింజా కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దిగివచ్చి ఈ డిమాండ్లను నెరవేర్చే దాకా పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం కొనసాగించాలని, ఇది మరో జాతీయ ఉద్యమంగా మారినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెబుతున్నారు.
అన్యాయం చేస్తున్నరు..
కడెం, డిసెంబర్ 1: దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ రైతాం గంపై వివక్ష చూపిం చడం సరికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒకరకంగా, తెలంగాణను మరో రకంగా వేరు చేసి చూపడం సరైంది కాదు. దేశంలో ప్రతి రాష్ర్టాన్ని ఒకేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాంత రైతాంగానికి అన్యాయం చేస్తున్నరు. ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచిన్రు. అదే వారికి నచ్చట్లేదు. రైతులను ముంచాలని చూస్తున్న కేంద్రానికి వత్తాసు పలుకుతూ స్థానిక బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నరు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ల పోరాటం చేస్తుంటే, వీళ్లు మాత్రం గొంతెత్తడం లేదు. ఇవ్వన్నీ రాష్ట్ర రైతాంగం గుర్తిస్తున్నది.
-పస్పుల నర్సయ్య, రైతు, సారంగాపూర్
యాసంగి వడ్లు కొనాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనాల్సిందే. రాష్ట్రంలో కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నరు. ప్రాజెక్టు లను కట్టించి అండగా నిలుస్తున్నరు. దేశంలనే మొదటి సారిగా ‘రైతు బంధు’గా నిలిచిన్రు. కేంద్రం మాత్రం రైతులు పండించిన పంటను కొనబోమని చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. బీజేపీ వల్లే దేశవ్యాప్తంగా సామాన్యులు, కార్మికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నరు. తెలంగాణ రైతుల కోసం పార్లమెంట్ల టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని చూస్తున్నం. బీజేపీ స్థానిక ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడుతలేరు. యాసంగి వడ్లు కొనిపించేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత ఆపార్టీ ఎంపీలు తీసుకోవాలి. పార్లమెంట్ల మాకోసం పోరాడుతున్న ఎంపీలకే మేం అండగా ఉంటం.