మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 20: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వనదేవతల జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రదాయరీతిలో గద్దెల వద్ద కోయ పూజారులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. మేడారానికి చెందిన గిరిజన పూజారి కృష్ణ దొర బృందం ఆధ్వర్యంలో సారలమ్మను డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో, పోలీసుల పహారా నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇల్లారి (గుడి) నుంచి పడిగిద్ద రాజు, గోవిందరాజులను, గద్దెలపైకి తీసుకవచ్చి ప్రతిష్ఠిచారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సారలమ్మను ద ర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
నేడు గద్దెలపైకి సమ్మక్క..
వనదేవతల జాతరలో భాగంగా గిరిజనుల ఇలవేల్పు సమ్మక్క తల్లి గద్దెల వద్దకు నేడు చేరుకోనుంది. ఇందుకోసం జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలతో పాటు, మహారాష్ట్ర నుంచి అమ్మవార్లకు మొక్కులను తీర్చుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భక్తులకు పూర్తి ఏర్పాట్లు చేశారు. భక్తులు పుణ్య స్నానాలను ఆచరించడానికి ప్రత్యేకంగా నల్లాలు, గదులను ఏర్పాటు చేశారు. పారిశుధ్య చర్యలను చేపట్టారు. రామగుండం సీపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ రాంనాథ్ కేకేన్ సూచనలతో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21: జిల్లా కేంద్రంలోని పెద్దవాగు ఒడ్డున వెలిసిన సమ్మకకు ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మొకులు చెల్లించుకున్నా రు. అమ్మవార్లకు బంగారం(బెల్లం)తో పాటు సారెను సమర్పించారు. మూడు రోజులపాటు జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.