దస్తురాబాద్, జనవరి 12 : మక్కజొన్న పంట వర్షాధారం, సాగు నీటి వనరుల కింద వానకాలం, యాసంగిలో రైతులు సాగు చేస్తారు. ఇది ఆహార పంటగానే గాక దాణా, పశువులకు మేత, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా, పాప్కార్న్గా తదితర రకాలుగా దీన్ని ఉపయోగిస్తారు. ఇందులోనూ పలు రకాలున్నాయి. ఆ రకాలను బట్టి పండిన మక్కలను వినియోగిస్తారు. కాగా, యాసంగి సాగులో రైతులు ఆధునిక పద్ధతి వైపు అడుగులు వేస్తున్నారు. ఖర్చు తగ్గించుకునే చర్యల వైపు మొగ్గు చూపి పంట సాగు చేస్తున్నారు. వరి కోసిన తర్వాత పొలంలో కొయ్య కాళ్లు ఉండగానే దుక్కి దున్నకుండానే తేమ (పదును) ఉండేలా చేసుకొని మక్క విత్తనాలను నేరుగా విత్తుతున్నారు. దీనిని జీరో టిల్లేజ్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి ద్వారా యాసంగిలో సాగు చేసుకోవచ్చు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావులు, బోర్లలో తక్కువ నీరున్నప్పుడు సరైన నీటి లభ్యత లేనప్పుడు చాలా మంది రైతులు వానకాలంలో వరి సాగు తర్వాత యాసంగిలో ఆరుతడి పంటగా మక్క పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పంట ఎంతో లాభాదాకయమైనది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సులభంగా సాగు చేసుకోవచ్చు. కొయ్య మక్క (జీరో టిల్లేజ్) పద్ధతి ద్వారా ఖర్చు తక్కువ, సమయం సైతం ఆదా అవుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ప్రసుత్తం మండలంలో 30 ఎకరాల్లో రైతులు మక్క సాగు చేస్తుండగా, ఇందులో 20 ఎకరాలకు పైగా కొయ్య మక్క పద్ధతిలో సాగవుతున్నట్లు తెలిపారు.
జీరో టిల్లేజ్లో మక్క సాగు చేసే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. అప్పుడే దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొదట నేలలో తేమ(పదును)ను గుర్తించి విత్తనాలు వేయడం చాలా ముఖ్యమైనది. వరి కోసిన తర్వాత సరైన పదునులో విత్తనాలు వేయాలి. వరి కోసిన పొలంలో నడిస్తే కాలు అచ్చు పడాలి. ఆ పదునులో విత్తనాలు వేసుకుంటే మొలక బాగా వచ్చి పంట ఏపుగా పెరుగుతుంది. వానకాలంలో పూర్తి తేమ ఆరిన తర్వాత వరి కోయాలి. కోత యంత్రం టైర్లు దిగబడి పొలమంతా ఎగుడుదిగుడులుగా ఉంటే మక్క కొయ్యల ఎదుగుదల సరిగ్గా ఉండదు. వరి కోసేటప్పుడు సాధ్యమైనంత వరకు నేలకు దగ్గరగా కోయాలి. చౌడు నేలలు తప్ప ఏ నేలలోనైనా విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో మొదటగా పొలానికి నీటిని పట్టాలి. రెండు నుంచి మూడు రోజుల తర్వాత తక్కువ నీటి సాంద్రత ఉన్న సమయంలో తాళ్ల సహాయంతో వెదురు కొయ్యలతో వరుస వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ గ్యాప్ ఉండేలా విత్తుకోవాలి. విత్తనాలు విత్తే ముందు సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం ఎరువు, 1/4 వంతు నత్రజని ఎరువు, సగం పొటాష్ ఎరువును తేమ ఉన్నప్పుడు విత్తన సాళ్లలో వేసుకోవాలి. లేదా విత్తనానికి 5 సెం.మీ దూరంలో మట్టి కప్పి పెట్టాలి. విత్తేటప్పుడు చిన్నపుల్ల సహాయంతో సిఫారసు చేసిన దూరంలో పైపైన మట్టితీసి గింజపెట్టి మట్టితో కప్పి పెట్టాలి. విత్తిన తర్వాత సరైన తేమ ఉన్నప్పుడు రెండు రోజుల్లోపు అట్రాజిన్ అనే కలుపు మందు ఒక కిలో, పారాక్యాట్ ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒక ఎకరం వరి పండించే నీటితో 2 ఎకరాల్లో మక్క పండించవచ్చు.
మాది గొడిసేర్యాల గోండుగూడెం. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని బంధువులు జీరోటిల్లేజ్ పద్ధతి ద్వారా మక్క పంటను సాగు చేశారు. ఈ పద్ధతిని చూసి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నా. ఒక ఎకరంలో ఈ పద్ధతి ద్వారా మక్క పంట సాగు చేశా. దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల ఖర్చు ఆదా అయింది. విత్తనాలు, కూలీలు, మందులకు రూ.7 వేలు మాత్రమే ఖర్చయ్యాయి. నాకు ఖర్చు, సమయం కలిసి వచ్చాయి.
– వెడ్మా రాజు, రైతు
ఆరుతడి పంటగా యాసంగిలో మక్క సాగు లాభాదాకయమైంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సులభంగా సాగు చేసుకోవచ్చు .కొయ్య మక్క (జీరో టిల్లేజ్) పద్ధతి ద్వారా మక్కను సాగు చేయడం ద్వారా రైతులకు ఖర్చు తక్కువ అవుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. కోత కాలం కంటే ముందే పంట చేతికి వస్తుంది. ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. ఈ పద్ధతిలో పంట దిగుడులు పెరిగే అవకాశం ఉంది. మండలంలోని పలు గ్రామాల్లో 20 ఎకరాలకు పైగా ఈ కొయ్య మక్క (జీరో టిల్లేజ్) పద్ధతి ద్వారా రైతులు పంట సాగు చేశారు.
– జాడి తిరుపతి, ఏఈవో, దస్తురాబాద్