ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 12: విద్యార్థులు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ క్రాంతికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ఉత్సత్తులు వాడకం, ధూమపానం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని వ్యక్తులతో పాటు చుట్టూ పక్కల వారికి పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం వంటి వాటితో అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ బోర్డు అధికారి శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, ఉపాధ్యాయులు నంద, మీనాక్షి, తదితరులు పాల్గొన్నారు.
గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం
ఇచ్చోడ, ఫిబ్రవరి 12 : గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్ఐ ఉదయ్కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని అడెగామ(బీ) గ్రామంలో గంజాయి సాగు నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలను క్రయ, విక్రయాలు చేసిన నేరమేనని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కదం వనిత, మాధవ్రావ్ ఆమ్టె, కదం బాబారావ్, మోహన్, పాండురంగ్, కదం దత్తు, మారుతిరావ్ పాల్గొన్నారు.
వ్యసనాలకు దూరంగా ఉండాలి
ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 12 : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ భరత్ సుమన్ సూచించారు. మండలంలోని సాలేవాడ(కే) గ్రామంలో గ్రామస్తులకు గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గంజాయి సాగు, రవాణా, తాగడం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత మంచి లక్ష్యంతో జీవించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, సిబ్బంది లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వినోద్, గ్రామస్తులు పాల్గొన్నారు