మగువ.. నీ తెగువ చూపించే సమయం ఆసన్నమైంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటరు జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే తొమ్మిది సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 11,25,656 మంది ఉండగా.. పురుష ఓటర్లు 10,93,381 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే 32,285 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉండగా.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడంలో అతివలే కీలకం కానున్నారు. కాగా.. కొత్త ఓటర్ల నమోదుకు అక్టోబర్ 1వ తేదీ కటాఫ్గా పెట్టారు. అంటే ఈ నెల 1 తేదీకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 30 వరకు ఇందుకు చాన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మంచిర్యాల, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. కాగా.. ఈ ఎన్నికల్లో మహిళల నిర్ణయం కీలకం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే అందులో తొమ్మిది నియోజకవర్గాల్లో పురుషులంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఒక్క సిర్పూర్ నియోజకవర్గంలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు కీలకం కానున్నాయి. పురుషులతో పోలిస్తే 33,160 అధిక ఓట్లు మహిళలవే ఉన్నాయి. అత్యధికంగా నిర్మల్లో 12,351, ముథోల్లో 6,192, బోథ్లో 5,375, ఆదిలాబాద్లో 4,073 , ఖానాపూర్లో 3,682, చెన్నూర్లో 172, బెల్లంపల్లి 6, మంచిర్యాల 421, ఆసిఫాబాద్లో 888 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉండడం గమనార్హం. కాగా.. కొత్త ఓటర్ల నమోదుకు అక్టోబర్ 1వ తేదీ కటాఫ్గా పెట్టారు. అంటే ఈ నెల 1 తేదీకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 30వ తేదీ వరకు ఇందుకు చాన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రతి నియోజకవర్గంలో మహిళల ఓట్లు కీలకం. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయడంతోపాటు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, గ్రామాలు, మండలాల్లో మహిళల నాయకులు పెరిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వచ్చిన దృష్ట్యా మహిళలకు ప్రాధాన్యం పెరిగింది. మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతోపాటు పురుషులతో పోలిస్తే మహిళలు ఎన్నికల్లో అధిక ప్రభావం చూపనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు మహిళలను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యాయి. చీరలు, కుక్కర్లు, ఫ్యాన్లు, టీవీలు, డబ్బులు ఇలా ఏదో ఒకటి ఆశ చూపించి స్త్రీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఈ తరహా ప్రలోభాలు అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలకు పోటీగా చీరెలు పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్లో ఓ నేత కుక్కర్లు ఇస్తుంటే, ఆసిఫాబాద్లో గోడ గడియారాలు ఇస్తున్నారు. కొందరు నాయకులైతే ప్రచారాలకు వెళ్లి మహిళలకు తాయిళాలు ఆశ చూపుతున్నారు. మహిళ లోకం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఐదేళ్లపాటు మన భవిష్యత్ను నిర్ణయించే అధికారాన్ని తాయిళాలకు ఆశ పడకుండా సమర్థులైన నాయకులకే కట్టబెట్టి నారీ శక్తిని చాటి చెప్పాలి.
దండేపల్లి, అక్టోబర్ 11 : ఎన్నికల వేళ ఓటు అనేది వజ్రాయుధం వంటిది. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని వదులుకోవద్దు.నచ్చిన నేతను ఎన్నుకునే అవకాశం మన చేతుల్లో ఉంది.ముఖ్యంగా మహిళా ఓటర్లలో చైతన్యం రావాలి. ముందుగా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ముందుగా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలి. యువతులు ఇంట్లో ఉన్న మహిళా ఓటర్లకు అవగాహన కల్పించాలి. ఓటుతో మంచి నేతను ఎన్నకునే అవకాశాన్ని వదులుకోవద్దు.
– ఎన్.అర్చన, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు, రెబ్బెన్పెల్లి.
దండేపల్లి, అక్టోబర్ 11 : గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు ఓటు వేసే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఓటు వేయకుండా విలువైన నేతను ఎన్నకునే అవకాశాన్ని వదులుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కావాలన్నా ఓటు వినియోగం చాలా కీలకం. ప్రతి ఒక్క మహిళా బాధ్యతగా ఓటు వేయాలి. ఓటు వేసేలాగా చుట్టూ పక్కల వారిని ప్రోత్సహించాలి. మగవారితో సమానంగా ఓటింగ్లో పాల్గొనాలి.
– నందుర్క సుగుణ, నాగసముద్రం, ఉత్తమ మహిళా రైతు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచార రథాలను సిద్ధం చేస్తున్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కైలాష్నగర్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రచార రథానికి మరమ్మతులు చేసి శుభ్రం చేస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న ప్రచారం చేయనున్నారు.
– ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, అక్టోబర్ 11