బోథ్, సెప్టెంబర్ 7: మండలంలో రెండు రోజులుగా జోరుగా వర్షం కురుస్తున్నది. మంగళవారం 105.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దవాగు, ధన్నూర్(బీ), మర్లపెల్లి, పట్నాపూర్, పెద్దగూడ, కోటా(కే), అందూర్ వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వాగు పరీవాహక, లోతట్టు ప్రాంతాల్లో పత్తి, సోయా, కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పట్నాపూర్ లోలెవల్ వంతెనపై కొట్టుకు వచ్చిన కలప దుంగలను పోలీసులు తొలగించారు.
పిడుగుపాటుకు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్
పాత ఖండిపల్లె వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ సోమవారం రాత్రి పిడుగు పాటుకు కాలిపోయింది. దాని పరిధిలోని గృహాల్లో ఉన్న టీవీలు, ఫ్రిజ్లు, సర్వీస్ వైర్లు కాలిపోయాయి. బోథ్ తహసీల్ కార్యాలయంలోని గదులు తడిగా మారడంతో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.
పొచ్చెర జలపాతం పరవళ్లు
బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో పెద్దవాగులోకి భారీగా వరద చేరడంతో జలపాతం వద్ద నీరు ఎగసిపడింది.
బేలలో..
మండలంలోని మణియార్పూర్, దహిగాం గ్రామాల సమీపంలోని బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించడంంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెన్గంగలో నీరు ప్రవహించడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మత్తడి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత
తాంసి, సెప్టెంబర్ 7: మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పూరి ్తస్థాయి నీటి మట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 277.10 మీటర్ల నీరు నిల్వ ఉంది. సగటున ప్రాజెక్టులోకి 3080 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 3910 క్యూసెక్కుల నీరు గేట్ల ద్వారా వదులుతున్నామని ఏఈ చెంచుబాబు తెలిపారు.
నిండుగా పెన్గంగ
గుబ్డి, అంతర్గాం, గోముత్రి, వడూర్, గొల్లగఢ్ గ్రామాల సమీపం నుంచి పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన మహారాష్ట్రలో ఇసాపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్గంగకు నీరు వచ్చి చేరుతున్నది. అర్లి(టీ)లో అమృత్ అనే వ్యవసాయ కూలీకి చెందిన పెంకుటిల్లు వర్షానికి కూలిపోవడంతో ధాన్యం, సామగ్రి తడిసిపోయాయి. రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. కరంజి(టీ), లక్ష్మీపూర్ వద్ద వాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బజార్హత్నూర్లో..
మండలంలోని భూతాయి, దేగామ, బజార్హత్నూర్, కాండ్లీ, కోల్హారి, జాతర్ల గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద వచ్చి చేరింది. వర్షానికి చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మండలంలోని వాగులు, వంకలు గలగల పారుతున్నాయి. మండల కేంద్రం నుంచి జాతర్ల గ్రామానికి వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా దేగామ చెరువులోకి వరద వచ్చి చేరింది.