ఎదులాపురం,సెప్టెంబర్23 : వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో గత మే నుంచి అర్ధరాత్రి వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 9న పట్టణ పోలీసులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏఎస్ఐ మహమ్మద్ సిరాజ్ఖాన్, కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ అలీ, కంప్యూటర్ నిపుణుడు సింగజ్వార్ సంజీవ్ కుమార్, ఎం.ఏ రియాజ్ అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన ఇళ్లను సందర్శించి సాక్ష్యాలను సేకరించారు. గురువారం ఉదయం రాంనగర్ శివారులో గ్రామీణ సీఐ కే. పురుషోత్తచారిచారి, పట్టణ సీఐ ఎస్.రామకృష్ణ ఆధ్వర్యంలో మావల ఎస్ఐ హరిబాబు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న షోయబ్ఖాన్ (19) బైక్పై వచ్చాడు. అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో మేలో జీఎస్ ఎస్టేట్ కాలనీలో రెండిళ్లలో 8 తులాల బంగారు ఆభరణాలు, ఆరు తులాల వెండి, కృష్ణానగర్, భాగవతినగర్ , పాత హౌసింగ్ బోర్డ్, ఎంప్లాయీస్ కాలనీ ల్లో ఏడు దొంగతనాలు చేసి మొత్తం 13 తులాల బంగారు, ఆరు తులాల వెండి ఆభరణాలు నాలుగు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.6.53 లక్షల విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, నాలుగు సెల్ ఫోన్లు , బైక్ను స్వా ధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టు అదేశాల మేరకు బాధితులకు బంగారు అభరణాలను అప్పగిస్తామని ఆయన తెలిపారు. సీఐలు కే.పురుషోత్తంచారి, ఎస్.రామకృష్ణ, ఎస్ఐ హరిబాబు, ఏఎస్ఐ మహమ్మద్ సిరాజ్ ఖాన్, కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్అలీ, కంప్యూటర్ నిపుణుడు సింగజ్వార్ సంజీవ్ కుమార్, ఎంఏ రియాజ్ పాల్గొన్నారు.