గడప దాటొద్దన్నారు. ధైర్యంగా దాటింది. బడికెళ్లింది.పొలిమేర దాటొద్దన్నారు. తెగించి అడుగేసింది. నగరానికెళ్లింది. పోటీ పరీక్షలు రాసింది. ఉద్యోగం తెచ్చుకుంది.ఇప్పుడు హద్దులు చెరిపేస్తూ.. సరిహద్దుల దగ్గర జవాన్గా విధులు నిర్వర్తిస్తూ.. సమాజంలో స్త్రీ స్థానం మహోన్నతమని నిరూపించింది సంస్థాన్ నారాయణపురం ఆడబిడ్డ బత్తుల లక్ష్మీ దేవి.
సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం.. బత్తుల మల్లయ్యకు ఆర్మీలో అవకాశం వచ్చింది. కానీ ఐదో తరగతి సర్టిఫికెట్ లేకపోవడంతో కొద్దిలోనే ఉద్యోగం చేజారింది. చాలా బాధపడ్డాడు. అలా అర్ధంతరంగా ఆగిపోయిన తండ్రి కలను.. నిజం చేసితీరాలని నిశ్చయించుకుంది ఆయన కూతురు లక్ష్మి. ఆడపిల్లను పెండ్లి చేసి అత్తవారింటికి పంపకుండా, ఆర్మీ ఉద్యోగం కోసం మగరాయుడిలా తయారు చేస్తున్నారని చాలామంది ఎగతాళి చేశారు. అయినా ఆ తండ్రీకూతుళ్లు పట్టించుకోలేదు. ఉదయం పూట అయితే నలుగురూ హేళన చేస్తారని, అర్ధరాత్రి అంతా నిద్రపోయాక.. తండ్రితో కలిసి రన్నింగ్కు వెళ్లేది లక్ష్మి. చిమ్మచీకట్లో లాంగ్ జంప్, హై జంప్ సాధన చేసేది. ఆ కఠోర శ్రమ ఫలితం ఇచ్చింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జవాన్ ఉద్యోగం వరించింది. వేలెత్తి చూపినవారే, ఆ విజయాన్ని చూసి.. భుజం తట్టి మెచ్చుకొన్నారు.
నాన్న కలయాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ
పురానికి చెందిన బత్తుల మల్లయ్య-కమలమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఆ కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. మల్లయ్య గీత కార్మికుడిగా పని చేస్తూ ఇద్దరు కూతుళ్లనూ చదివించాడు. ఆడపిల్లలు బాగా చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలనీ, స్వతంత్రంగా బతకడం నేర్చుకోవాలనీ కూతుళ్లతో తరచూ చెప్పేవాడాయన. అందులోనూ, చిన్న కూతురు లక్ష్మీదేవి చిన్నతనం నుంచీ చురుకే. డిగ్రీ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వరుస నోటిఫికేషన్లు రావడంతో.. పోలీస్ కానిస్టేబుల్, ఆర్టీసీ కండక్టర్, బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. బీఎస్ఎఫ్ ఫిజికల్ టెస్ట్లో దృఢత్వాన్ని నిరూపించుకుంది. రాత పరీక్షలో ప్రతిభను చాటుకుంది. మెడికల్ టెస్టులోనూ అర్హత సాధించింది. అంతిమంగా, ఉద్యోగానికి ఎంపికైంది. అప్పటికి లక్ష్మి వయసు ఇరవై మూడు. ‘ఆడపిల్లకు ఆర్మీ ఉద్యోగమా?’ అంటూ బంధువులు నొసలు చిట్లించారు. ఆత్మీయులు అడ్డు చెప్పారు. ఇరుగూపొరుగూ గుసగుసలాడారు.
పెండ్లి కష్టం అవుతుందేమో అని హెచ్చరించారు. లక్ష్మి అవన్నీ పట్టించుకోలేదు. చేతిలో సూట్కేసుతో, గుండెలనిండా ఆత్మవిశ్వాసంతో ట్రైనింగ్కు బయల్దేరింది. ముప్పై నాలుగు వారాల కఠోర శిక్షణలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. పురుషులతో పోటీ పడింది. కొండలెక్కింది, గుట్టలెక్కింది. గన్ చేతపట్టి గురిపెట్టి కాల్చింది. కసరత్తులతో శరీరాన్ని తీర్చిదిద్దుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తొలి పోస్టింగ్. ‘నా ఉద్యోగ ప్రయత్నంలో అమ్మానాన్న మినహా.. ఎవరూ ప్రోత్సహించలేదు. కన్నవాళ్లు నా కోసం ఎన్నో అవమానాలు పడ్డారు. నాన్న నా ఖర్చుల కోసం పైసాపైసా కూడబెట్టి, ముప్పైవేలు దాచిపెట్టారు. ఆ రుణం తీర్చుకోలేనిది. కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు. నన్ను జవాన్గా చూడాలనుకున్న నాన్న కోరికను నెరవేర్చా. నా బిడ్డ ఆర్మీలో పని చేస్తుందని ఇప్పటికీ నాన్న గర్వంగా చెప్పుకొంటారు’ అంటూ కన్నవారి త్యాగాలను వివరిస్తుంది జవాన్ లక్ష్మి. ఎనిమిదేండ్లుగా ఆమె సరిహద్దుల వెంట పహరా కాస్తూనే ఉన్నది. చొరబాటుదారులు, సంఘ విద్రోహశక్తులు కన్నెత్తి చూడకుండా మాతృభూమిని రక్షించుకుంటూనే ఉన్నది.
ఇది నా అదృష్టం
లక్ష్మి భర్త పంజాబ్ బీఎస్ఎఫ్లో జవాను. జీవిత భాగస్వాములిద్దరూ దేశ రక్షణలోనూ భాగస్వాములే. ఒకరు ఒక దిక్కున పహరా కాస్తే, మరొకరు ఇంకో దిక్కున గస్తీ తిరుగుతున్నారు. అంతే తేడా. పెండ్లి విషయంలో లక్ష్మి చాలా ఇబ్బందులు పడింది. ఉద్యోగం మానేస్తే చేసుకుంటామని చాలా మంది ముందుకొచ్చారు. ‘అవసరమైతే వివాహాన్ని వదులుకొంటాను కానీ, ఉద్యోగానికి రాజీనామాచేసే సమస్యే లేద’ని స్పష్టంగా చెప్పింది. ‘నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తి దొరికితేనే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నా’ అంటుందామె. సరిగ్గా అలాంటి వ్యక్తే తారసపడ్డాడు. ‘ఐదు నెలల క్రితం నా వివాహం జరిగింది. మా ఆయన పేరు ప్రసన్న కుమార్ గౌడ్. తనది శ్రీకాళహస్తి. పంజాబ్ బీఎస్ఎఫ్లో జవాను. నా లక్ష్యాలను, నన్ను ఆయన చాలా గౌరవిస్తారు. ఇద్దరమూ దేశ రక్షణలో పాలు పంచుకునే అవకాశం రావడం అదృష్టం’ అంటున్నప్పుడు లక్ష్మి కండ్లలో మెరుపు. తొలి లక్ష్యం నెరవేరింది. జవాను ఉద్యోగం వచ్చింది. వివాహంతో జీవితమూ పరిపూర్ణమైంది. ఇప్పుడు తన ఆశయం.. సబ్ ఇన్స్పెక్టర్ హోదా సాధించడం. ఆ పరీక్షలకూ సిద్ధం అవుతున్నది. మరో గెలుపు లక్ష్మి కోసం ఎదురుచూస్తున్నది. మరోసారి బత్తుల మల్లయ్య ‘నా కూతురు సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు’ అని సంస్థాన్ నారాయణపురం సాక్షిగా ప్రకటించే రోజూ ఎంతోదూరం లేదు.
ప్రస్తుతం మహిళలకు ఆర్మీలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదనడానికి నా జీవితమే ఉదాహరణ. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. చిన్న ఉద్యోగమైనా సరే చేయాలి. మగువ తలుచుకొంటే మగవారికి దీటుగా ఏ రంగంలోనైనా రాణించగలదు.
-బత్తుల లక్ష్మి
-పాష షేక్