జన గణ మన
అధినాయక జయహే..
భారత భాగ్య విధాత..
మన జాతీయ గీతాన్ని దాదాపు 52 సెకెన్లలో ఆలపించవచ్చు. కానీ, ఇది సంక్షిప్త రూపమే. సంపూర్ణ జాతీయ గీతంలో మొత్తం ఐదు చరణాలు ఉంటాయి. తుదిదాకా పాడాలంటే..
ఐదు నిమిషాలు పడుతుంది. పూర్తి గీతాన్ని.. ఏడు గంటల్లో 75 సార్లు ఆలపించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించింది కరీంనగర్కు చెందిన పండుగ అర్చన. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. దేశమంతా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకొంటున్న వేళ.. తనవంతుగా పూర్తి స్థాయి జాతీయ గీతాన్ని 75 సార్లు పాడాలని నిర్ణయించుకుంది.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ అరుదైన ఘట్టాన్ని రికార్డులకెక్కించారు. అర్చన విద్యాధికురాలు. స్థానిక అల్ఫోర్స్ పాఠశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నది. బాల్యం నుంచే తనకు జాతీయగీతమంటే చాలా గౌరవం. విద్యార్థిగా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా.. ప్రార్థన సమావేశానికి తప్పక హాజరవుతుంది. చివరగా అందరితో కలిసి జన గణ మన ఎలుగెత్తి పాడుతుంది. జిల్లాలో నిర్వహించే పలు శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరవుతూ ఉంటుంది ఆమె. ఉపాధ్యాయ శిక్షణను కూడా జాతీయగీతంతోనే ప్రారంభిస్తానని చెబుతున్నది పండుగ అర్చన.
…? వీర్ల రంజిత్ రంగా