దసరా నవరాత్రుల్లో.. పెద్దంచు పట్టుచీరతో, ఒంటి నిండా ఆభరణాలతో దర్శనమిస్తుంది దుర్గాదేవి. ఆ తల్లి దీవెనలు తమపై ఎప్పుడూ ప్రసరించాలని కోరుతూ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ మూర్తిని నగలలోనూ పొదుగుతున్నారు. కంఠాభరణాలు, అంగుళీకాలపై మహిషాసుర మర్దినిని ముద్రిస్తున్నారు. అమ్మవారి రూపు ఉన్న లాకెట్లు, ఉంగరాలను ధరించడం వల్ల దుష్టశక్తులను దూరంగా ఉంచవచ్చన్నదీ ఓ నమ్మకం. బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలతో చేసిన నగలతోపాటు ఈతరానికి నప్పేలా ఆధునిక జువెలరీలోనూ దుర్గాదేవి రూపాన్ని నింపుకున్న నగలు వచ్చేశాయి. సిల్క్, ఫ్యాబ్రిక్, త్రెడ్ జువెలరీకి కూడా వీటిని జతచేస్తున్నారు. మట్టితో మలిచే టెర్రకోటా నగలపైనా, తేలికపాటి పేపర్, వుడ్ జువెలరీపైనా సింహవాహిని కొలువు దీరుతున్నది. ప్రసన్న వదన అయిన అమ్మవారి రూపానికి గవ్వలు, పూసలు, ముత్యాలు, రత్నాలతో మెరుగులద్ది అందమైన ఆభరణాలుగా మలుస్తున్నారు. తొమ్మిదిరోజులకే కాదు, మూడొందల అరవై అయిదు రోజులూ ధరించడానికి కూడా బావుంటాయి.