వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ముమ్మరించే సమయం. ఇంట్లోఒకరికి వస్తే చాలు ఇంటిల్లిపాదికీ వ్యాపిస్తాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి రుగ్మతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే సాధారణ చికిత్సతోనే బయటపడవచ్చు. గర్భిణుల విషయంలో నిర్లక్ష్యం..
తల్లీ బిడ్డలకు ప్రాణాంతకమే.
వర్షాకాలం.. ప్రతినిత్యం చినుకుల టపటపలే. వీధులన్నీ జలమయమే. మురుగు కాలువలు పొంగిపొర్లుతుంటాయి. ఆ కాలుష్య జలాలే క్రిమికీటకాలకు ఆవాసాలు. అందుకే, వానల సమయంలో అంటు వ్యాధులు ప్రబలుతాయి. ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ గర్భిణులు సీజనల్ వ్యాధులు సోకినప్పుడు సాధారణ రోగుల్లా ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదు. కొన్ని ఔషధాలు కడుపులో బిడ్డపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి, వైద్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఏమరుపాటు అసలే పనికిరాదు. జ్వరం లక్షణాలు కనిపించగానే.. అది కరోనానా లేదంటే ఏదైనా సీజనల్ వ్యాధా అనేది నిర్ధారణ చేసుకోవాలి. సొంతవైద్యం పనికిరాదు. యాంటీ బయాటిక్స్ ఏమంత శ్రేయస్కరం కాదు. సీజనల్ వ్యాధిగా భావించిన వారిలోనూ కరోనా నిర్ధారణ జరుగుతున్న సందర్భాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన కారణాలు
వివిధ రుతువులలో వాతావరణ సంబంధమైన మార్పుల కారణంగా వచ్చే వ్యాధులనే సీజనల్ వ్యాధులని అంటారు. ఈ రుగ్మతలకు నాలుగు ప్రధాన కారణాలు.. గాలి, నీరు, దోమలు, కలుషిత ఆహారం. వర్షం వల్ల గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దాంతో చల్లటి గాలి వీస్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం ఇబ్బంది పెడతాయి. వైరల్ ఫీవర్, ఫ్లూ వెన్నంటి వస్తాయి. నీటివల్ల అంటే… కలుషిత నీరు తాగడంవల్ల టైఫాయిడ్, డయేరియా వెంటాడతాయి. ఇక, మూడో కారణం దోమలు. పగటివేళ దోమకాటు వల్ల డెంగీ, చికున్గున్యా సోకుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే గర్భిణులకు ప్రమాదకరం. ఇక కలుషిత ఆహారం వల్ల డయేరియా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధుల బారినపడతారు.
ఇన్ఫెక్షన్లకు ఆస్కారం
గర్భధారణ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సులభంగా సోకుతాయి. సీజనల్ వ్యాధుల ముప్పూ ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే కడుపుతో ఉన్నవారు పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అవసరమైతే విటమిన్ సప్లిమెంట్లు కూడా వాడాల్సి ఉంటుంది.
ఆ జ్వరాలు ప్రమాదకరం
సీజనల్గా వచ్చే డెంగీ, మలేరియా, డయేరియా, కామెర్లు గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల తల్లీబిడ్డలు ఇద్దరికీ గండమే. డెంగీ వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్రసవ సమయంలో ఇది చాలా ప్రమాదకరం. తల్లికి కామెర్లు వస్తే బిడ్డకూ సోకవచ్చు. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధుల వల్ల తీవ్రజ్వరం, వాంతులు, విరేచనాలు అవుతాయి. దీనివల్ల రోగి డీ-హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది కడుపులోని బిడ్డపైనా ప్రభావం చూపుతుంది.
మూడు నెలల్లోపు వస్తే..
గర్భం ధరించిన మూడు నెలల్లో సీజనల్ వ్యాధులు సోకినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో చికిత్స అందిస్తే ఎలాంటి ముప్పూ ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం అబార్షన్కు దారితీసే ప్రమాదం ఉంది. ఎర్లీ ప్రెగ్నెన్సీ దశలో.. తీవ్రమైన జ్వరం వచ్చినా, నీటి విరేచనాలు ఎక్కువగా జరిగినా, వాంతులు ఉక్కిరిబిక్కిరి చేసినా.. గర్భం నిలవకపోయే ఆస్కారం ఎక్కువ. తల్లితోపాటు పొట్టలోని బిడ్డకు కూడా ప్రమాదకరమే. వాంతులు,విరేచనాల వల్ల శరీరంలోని నీరంతా బయటికి వచ్చేస్తుంది. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం మేలు. కానీ చాలామంది తేలికగా తీసు కుంటారు. చిట్కా వైద్యాలతో సరిపెట్టుకుంటారు. దీన్ని కూడా ఓ గర్భధారణ లక్షణంగా పొరబడే ప్రమాదమూ ఉంది.
నెలలు నిండకుండానే
డెంగీ సోకిన గర్భిణులకు ముందస్తు ప్రసవానికి అవకాశం ఎక్కువ. నెలలు నిండకుండానే కాన్పు జరిగితే తల్లితోపాటు బిడ్డను కూడా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముందుగా ప్రసవం కావడం వల్ల శిశువు తక్కువ బరువుతో జన్మిస్తుంది. కొన్నిసార్లు శిశువులో అవయవాలు కూడా పూర్తిస్థాయిలో వృద్ధి చెందకపోవచ్చు. అలా డెంగీ వ్యాధి తల్లీ
బిడ్డలు ఇద్దరిపైనా ప్రభావం చూపుతుంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
సాధారణ జలుబు, జ్వరం, దగ్గు, మలేరియా, కామెర్లు, వాంతులు, విరేచనాలు, కొవిడ్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్ ప్రధాన సీజనల్ వ్యాధులు. వీటి నుంచి తప్పించుకోవాలంటే..
వ్యాక్సిన్లే రక్ష
ఫ్లూ వ్యాక్సిన్లు గర్భిణులకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే తప్పకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణుల్లో ఈ టీకా రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు, ఇతర జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది. గర్భిణులకు నాలుగో నెలలో ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్ ఇస్తారు.‘
-మహేశ్వర్రావు బండారి
డాక్టర్ బి.దుర్గారాణి
అబ్స్టెట్రీషియన్ & గైనకాలజిస్ట్