అవును. ఒక్క రక్తపు బొట్టు చాలు. చిన్నపాటి పరీక్షలు సరిపోతాయి. మనిషి ఆరోగ్య చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు.రాబోయే రోగాల గుట్టు విప్పవచ్చు. కొత్త వ్యాధులు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అప్పటికే ఉన్న రుగ్మతలకు కచ్చితమైన ఔషధాలనూ గుర్తించవచ్చు.ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ‘జీనోమ్ అనాలిసిస్’కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది.
జన్యు నిర్మాణం మహాద్భుతం. మనుషుల్లో 99.9 శాతం జన్యువులు ఒకేలా ఉంటాయి. మిగిలిన 0.1 శాతం తేడాను బట్టి వ్యక్తుల మధ్య అనేక వ్యత్యాసాలు ఏర్పడతాయి. జీనోమ్ అనాలిసిస్ అంటే.. జన్యు విశ్లేషణ. మనిషి జన్యువులలో సమస్త సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. వాటిని విశ్లేషిస్తే మన మూలాలు మొదలు ఆరోగ్య చరిత్ర వరకు అన్ని వివరాలూ తెలుసుకోవచ్చు. క్యాన్సర్, గుండె రుగ్మతలు, నాడీ సంబంధ సమస్యలు.. మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఏమేరకు ఉన్నదీ ఓ అంచనాకు రావచ్చు. కొన్ని వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవసరమైతే, ముందస్తు చికిత్సకు వెళ్లవచ్చు. ప్రమాద హెచ్చరికలను బట్టి జీవనశైలి లోపాలను సవరించుకోవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యల బారినపడే ఆస్కారం ఉంటే, ఆహార నియమాలతో ఒడ్డున పడవచ్చు. అప్పటికే వివిధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు మరింత కచ్చితమైన ఔషధాలను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు సమర్థమైన చికిత్స అందుతుంది. అంతేకాదు, ఏయే మందుల వల్ల దుష్ప్రభావాలు ఉన్నదీ తెలిసిపోతుంది. సాధారణంగా హృద్రోగంతోపాటు కాలేయ, మూత్రపిండ క్యాన్సర్లతో ముడిపడిన కుటుంబ చరిత్ర ఉన్నవారికి ‘జీనోమ్ అనాలసిస్’ తప్పనిసరి. ఇరవై ఏండ్లు దాటిన మహిళలు, నలభై దాటిన పురుషులు వీలైనంత త్వరగా ఈ పరీక్షలకు వెళ్లడం మంచిదంటారు నిపుణులు.
ఫార్మకో జీన్స్ను బట్టి..
ఫార్మకో జన్యువులు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. మనిషి ఆరోగ్య చరిత్రను బట్టి వాటి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. డీఎన్ఏ ఆధారంగానే వ్యక్తి ఆరోగ్య చరిత్రను విశ్లేషించినా, ఫార్మకో జీన్స్ను బట్టే ఆయా వ్యాధులకు ఎలాంటి ఔషధాలు వాడాలన్నది సిఫారసు చేస్తారు నిపుణులు. రోగిని వేధిస్తున్న వివిధ రుగ్మతలకు ఫార్మకో జీన్స్ మ్యుటేషన్స్ ఆధారంగానే మందులను సూచిస్తారు. ఫార్మకో జీన్స్లో మ్యుటేషన్స్ తక్కువగా ఉన్నవారికి తక్కువ డోసేజీ ఔషధాలను, ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ డోసేజీ ఔషధాలను ఇస్తారు. ఆయా మందుల పనితీరును కూడా జీనోమ్ సీక్వెన్స్ పరీక్ష ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. ఏ వ్యాధికి ఏ రకమైన మందులు పనిచేస్తాయో కచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు, ఎలాంటి మందులు వాడితే దుష్ప్రభావాలు వస్తాయి, వచ్చినా ఆ తీవ్రత ఏ మేరకు ఉంటుందన్నది కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. దీనివల్ల, విలుకాడు లక్ష్యానికి గురిపెట్టినంత కచ్చితంగా వైద్యుడు రోగిలోని రుగ్మతకు చికిత్స అందించవచ్చు. అప్పటికే వ్యాధి లక్షణాలు ఉంటే, మలి దశకు విస్తరించకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల రోగి త్వరగా కోలుకుంటాడు, చికిత్స వ్యయమూ తగ్గుతుంది.
ఈ వ్యాధులను గుర్తించవచ్చు..
జీర్ణవ్యవస్థ రుగ్మతలు.
వివిధ అలర్జీలు.
గుండె సమస్యలు.
క్యాన్సర్ ప్రమాదాలు.
మూత్రపిండ వ్యాధులు.
మధుమేహం, ఊబకాయం.
నాడీ సంబంధ వ్యాధులు.
మానసిక వ్యాధులు. మహిళల విషయంలో అయితే..
నెలసరి సమస్యలు.
బరువు పెరగడం, పీసీఓఎస్.
థైరాయిడ్ రుగ్మతలు, సంతానలేమి.
రొమ్ము, అండాశయ సంబంధ క్యాన్సర్.
అవాంఛిత రోమాలు.
తీవ్రంగా జుట్టు రాలడం.
జన్యు విశ్లేషణలో భాగమైన పరీక్షలు..
డీఎన్ఏ టెస్ట్.
కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ).
మెటబాలిక్ ప్రొఫైల్, క్యాల్షియం, మెగ్నీషియం పరీక్షలు.
లిపిడ్ ప్రొఫైల్.
కాలేయ పనితీరు పరీక్ష.
మూత్రపిండాల (కిడ్నీ) పనితీరు పరీక్ష.
థైరాయిడ్ ప్రొఫైల్.
ఐరన్ స్టడీస్, విటమిన్స్, మినరల్స్ పరీక్షలు.
జీనోమ్ అనాలసిస్ ఇలా..
ఈ విధానంలో వ్యక్తి నుంచి 2 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. ఈ రక్తంతో రెండు రకాల ప్రధాన పరీక్షలు జరుపుతారు. ఒకటి.. కంప్లీట్ బ్లడ్ వర్క్. రెండు.. డీఎన్ఏ పరీక్ష. కంప్లీట్ బ్లడ్ వర్క్ ద్వారా మెటబాలిక్ ప్రొఫైల్, కిడ్నీ పనితీరు, కాలేయం పనితీరు పరీక్షలు జరుపుతారు. అదే సమయంలో డీఎన్ఏ విశ్లేషణ ద్వారా ‘నెక్స్జెన్ సీక్వెన్స్’ తెలుసుకుంటారు. ఇందులో వచ్చిన ఫలితాలను ప్రొప్రైటరీ డేటాబేస్ ఆధారంగా విశ్లేషిస్తారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి సంబంధించిన ఫార్మకో జీనోమిక్స్, ఫిట్నెస్, రోగ నిరోధకత, వ్యాధుల ముప్పు తదితర అంశాలతో కూడిన పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆ ఫలితాలను బట్టి వైద్య చరిత్ర, తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన నియమాలు, ఎంచుకోవాల్సిన జీవన విధానం.. సాధికారికంగా సూచిస్తారు.
జన్యు స్వభావాన్ని బట్టి తగిన వ్యాయామాన్ని కూడా సిఫారసు చేస్తారు. ఎందుకంటే, కొందరికి కొన్ని రకాల వ్యాయామాలు మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. నేత్ర ఆరోగ్యాన్ని, ఎముకల సాంద్రతను, కిడ్నీల నాణ్యతను కూడా అంచనా వేస్తారు. నివేదిక ఆధారంగా సమీప భవిష్యత్తులో ఎదురయ్యే కేశ, చర్మ సంబంధమైన సమస్యల విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. పార్కిన్సన్స్, అల్జీమర్స్, బైపోలార్ డిసీజెస్, స్కిజోఫ్రీనియా తదితర నాడీ సంబంధ వ్యాధుల గురించి కూడా ముందస్తు అంచనాకు రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు ఓ తీవ్ర సమస్య. ప్రతి పదివేల మందిలో ఇరవైమంది గుండెపోటుకు గురవుతున్నారని అంచనా. ఆ తీవ్రతకు అనేక కారణాలు. అందులో జన్యుపరమైన సమస్య కూడా ఒకటి. జన్యు విశ్లేషణతో ఆ హెచ్చరికలనూ అందుకోవచ్చు.
డీఎన్ఏ ఆధారిత చికిత్సలు
మధుమేహం.
అధిక రక్తపోటు.
గుండె సమస్యలు.
ఊబకాయం.
అలర్జీలు.
అకాల వృద్ధాప్యం.
కాగ్నిటివ్ డిక్లయిన్.. నిత్య వ్యవహారాలను సైతం సమర్థంగా నిర్వహించలేకపోవడం. అయోమయం, మతిమరుపు, మనుషులను గుర్తించడంలో ఇబ్బంది.. మొదలైనవి.
కీళ్ల సమస్యలు.జీర్ణాశయ సమస్యలు.హార్మోన్ల అసమతౌల్యం (థైరాయిడ్ వ్యాధులు మొదలైనవి)
భవిత ‘పర్సనలైజ్డ్ మెడిసిన్’దే..
కేవలం రోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా.. మనిషి జన్యువులు, జీవనశైలి ఆధారంగా మందులను సిఫారసు చేయడమే పర్సనలైజ్డ్ మెడిసిన్. రోగం వచ్చింది, మందులు ఇచ్చాం.. అన్నట్టు కాకుండా. మూలాలను విశ్లేషించడం అన్నమాట! ఈ పద్ధతిలో సత్ఫలితాలు కనిపిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ‘టార్గెటెడ్ జీన్ థెరపీ’దే రాజ్యం. అంటే, ప్రతి రోగికి జీనోమ్ సీక్వెన్స్ అనాలసిస్ తప్పనిసరి కావచ్చు. ఆ ఫలితాల ఆధారంగా వైద్యులు జీన్ థెరపీ చేస్తారు. రోగిలోని వ్యాధిని లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన ఔషధాలను ఇస్తారు. అంటే, ప్రతి వ్యక్తి దగ్గరా తనదైన మెడికల్ ప్రొఫైల్ సిద్ధంగా ఉంటుంది. దాన్ని బట్టే వ్యాధిని నివారించే లేదా నియంత్రించే ప్రయత్నం జరుగుతుంది. ఈ విధానాన్ని ‘పర్సనలైజ్డ్ మెడిసిన్’ అంటారు. అనారోగ్యం బారినపడి, ఏ తుది దశలోనో వైద్యుడిని సంప్రదించి.. ప్రాణాల మీదికి తెచ్చుకునే కంటే – ముందు జాగ్రత్తతో, జన్యుపరమైన ఆరోగ్య విశ్లేషణతో మనల్ని మనం శక్తిమంతం చేసుకోవడమే ఉత్తమం. -మహేశ్వర్రావు బండారి
డాక్టర్ కల్యాణ్ రామ్ ఉప్పలూరి
డాక్టర్ హిమ చల్లా
జీన్ పవర్-ఆర్ఎక్స్ క్లినిక్, జూబ్లీహిల్స్
www.genepowerx.com