మొదటి దశతో పోలిస్తే కరోనా రెండో దశ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై నిర్దాక్షిణ్యంగా పంజా విసురుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో అందుబాటులో ఉండే ఆయుర్వేద వనమూలికలతో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
తులసి: దీని ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తులసి ఆకులను రోజూ తీసుకోడం వల్ల విటమిన్- ఎ, కె అధికంగా లభిస్తాయి. జ్వరం తగ్గించడంలో సహాయపడుతాయి. జలుబు, దగ్గుకు చక్కని ఔషధం కూడా. గుండె ఆరోగ్యానికి అండగానూ నిలుస్తుంది ఇది.
పసుపు: భారతీయుల వంటల్లో పసుపు ఎంతో ప్రధానం. ఇందులో రోగ నిరోధక శక్తి పుష్కలం. క్యాన్సర్ నిరోధక లక్షణాలూ ఉన్నాయి. పసుపును పిల్లల రోజువారీ ఆహారంలో భాగం చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండెజబ్బుల ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది.
అశ్వగంధ: పురాతన ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. శారీరక రుగ్మతలను నయం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. పిల్లల్లో ఒత్తిడిని దూరం చేసి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాల పనితీరు కూడా మెరుగవుతుంది.
ఉసిరి: ఇందులో విటమిన్స్ పుష్కలం. పిల్లల్లో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పిని తగ్గించడంలో ఉసిరికి తిరుగులేదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా ఉసిరి బాగా పనిచేస్తుంది.
తిప్ప తీగ: పిల్లలకు వచ్చే డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను తిప్ప తీగ నివారిస్తుంది. దీనితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుల రసాన్ని తులసి ఆకుల్లో ఉడికించి తాగిస్తే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.