కన్నతల్లి లాలిపాటతో స్వరాలు నేర్చుకున్నాడు. కొమ్మల్లో కుకూలు విని గమకాలు ఒంటబట్టించు
కున్నాడు. వీచేగాలి, పారే సెలయేరు, రాలే పూలు, రేగే పుప్పొడి..రేలా కుమార్ను గాయకుడిగా తీర్చిదిద్దాయి. ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా..’ అంటూసాగే ట్రిపుల్ ఆర్ సినిమాలోని పతాక గీతిక ‘రేలా’గళం నుంచే పెల్లుబికింది. ములుగు జిల్లా పత్తిపల్లిలో జన్మించిన ఈ పల్లె గాయకుడి ప్రస్థానమిది..
రేలా కుమార్ తల్లిదండ్రులు సరోజన, కుమారస్వామి వ్యవసాయ కూలీలు. ఆ ఇంట మూడో సంతానంగా కుమార్ జన్మించాడు. సరోజనమ్మ పాటలు చక్కగా పాడేది. అమ్మతో గొంతు కలిపేవాడు కుమార్. వయసు పెరిగేకొద్దీ పాటల మీద ఆసక్తి పెరిగింది. ఏటూరు నాగారం గిరిజన సంక్షేమ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఎప్పుడు పోటీలు జరిగినా కుమార్ పాటలు పాడటం, బహుమతులు గెలుచుకోవడం మామూలే! ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తెలంగాణ ధూంధాం వేదికలపై ఉద్యమ గీతాలు ఆలపించి ‘శభాష్’ అనిపించుకున్నాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం వందలాదిగా పాటలు పాడాడు. టీవీ కార్యక్రమాల్లోనూ సత్తా చాటాడు.
విజయ గీతికలు
సినిమాల్లో గాయకుడిగా అవకాశాల కోసం పట్టువదలకుండా ప్రయత్నించాడు కుమార్. ‘రంగస్థలం’తో మంచి బ్రేక్ వచ్చింది. ‘ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి..’ పాట విజయవంతం కావడంతో కుమార్ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మహేశ్బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘ముసలితాత ముడత ముఖం మురిసిపోయెలే’, ఎఫ్-2లో ‘డింగు డాంగ్ డింగు డాంగ్రో’.. పాటలు అతని గొంతుకలో వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. ట్రిపుల్ ఆర్లో పాడిన ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా..’ పాట తన కెరీర్లోనే గొప్పదని అంటాడు రేలా కుమార్. ‘నేను పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయి. ప్రజల ఆశీస్సులతో మరింత ముందుకుసాగుతా’ అని చెప్పుకొచ్చాడు రేలా కుమార్.