పాప పుట్టింది! బాబు పుట్టాడు! తాతయ్య ఓ బొమ్మ తెస్తారు. నానమ్మ ఇంకోటి కొంటుంది. మేనమామలూ, మేనత్తలూ కూడా షాపింగ్కు బయల్దేరతారు.బారసాల, అన్నప్రాశన, పుట్టు వెంట్రుకలు.. తొలి పుట్టినరోజు వరకూ ఎన్నో వేడుకలు. ఆ తర్వాత కూడా పండుగలూ పబ్బాలకు రకరకాల పిల్లల వస్తువులు కానుకగా అందుతూనే ఉంటాయి. బిడ్డలు పెరిగేకొద్దీ అవన్నీ మూలన పడిపోతాయి. చూసిచూసి ఉచితంగా ఇవ్వలేం. అలా అని ఇంట్లో పెట్టుకోనూలేం. ఈ సమస్యకు పరిష్కారమే.. ‘యాజ్ దె గ్రో’.
హైదరాబాద్కు చెందిన అంకిత ఇనానీది పెద్ద కుటుంబం. స్నేహితురాళ్లూ ఎక్కువే. దాదాపుగా ఒకే ఏడాది అందరి పెండ్లిళ్లూ అయిపోయాయి. కొద్ది నెలల తేడాతో అందరూ అమ్మలుగా పదోన్నతి పొందారు. ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్నో బొమ్మలు కొనేశారు. బంధుమిత్రుల నుంచీ చాలానే అందాయి. ఆ తర్వాత ఏదో ఫంక్షన్లో అంతా కలుసుకున్నారు. అప్పుడే పాత బొమ్మల ప్రస్తావన వచ్చింది. వాటిని ఆన్లైన్లో విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది అంకితకు. తన సోదరి రీతూ కాబ్రాతో ఆ ఐడియాను పంచుకుంది. ఇద్దరూ ఓ నిర్ణయానికొచ్చాక.. స్నేహితులకు, బంధువులకు కొత్త వ్యాపారం గురించి చెప్పారు. అంతా అటకమీదున్న బొమ్మలు, పిల్లల వస్తువులు ఇచ్చి ప్రోత్సహించారు. అలా, ‘యాజ్ దె గ్రో’ స్టార్టప్ ప్రాణంపోసుకుంది.
కొత్త, పాత బొమ్మలు
ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘యాజ్ దె గ్రో’ వ్యాపారాన్ని విస్తరించింది అంకిత. తమ పిల్లలు వాడిన బొమ్మలు, వాకర్లు, సైకిళ్లు మొదలైనవాటిని తల్లిదండ్రులు ‘యాజ్ దె గ్రో’కు విక్రయించవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని శుభ్రపరిచి, పూర్తిగా శానిటైజ్ చేసి, తుది మెరుగులు దిద్ది.. కొత్తగా తయారు చేస్తుంది అంకిత టీమ్. దీనివల్ల తల్లిదండ్రులకు ఎంతోకొంత డబ్బు వస్తుంది, వృథా కూడా తగ్గుతుంది. ఎవరో వాడిన బొమ్మలతో తమ పిల్లలు ఆడుకోవడానికి కొందరు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారికోసం సరికొత్తవీ విక్రయిస్తున్నారు. ‘ఇప్పుడు మా స్టార్టప్కు అనుబంధంగా 75 వేలమంది తల్లి
దండ్రులు ఉన్నారు. ఇప్పటికే ఐదు వేలకుపైగా ఉత్పత్తులను విక్రయించాం. వీటిలో మంచాలు, సైకిళ్లు, బేబీ క్యారియర్లు, పుస్తకాలు మొదలైనవి ఉన్నాయి’ అంటూ తమ వ్యాపార ప్రస్థానాన్ని వివరిస్తారు అంకిత ఇనాని.
తనిఖీల తర్వాతే..
‘యాజ్ దె గ్రో’ ద్వారా సేకరించే వస్తువులకు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు. వాటివల్ల పిల్లలకు ఎలాంటి హాని ఉండదని నిర్ధారించుకున్నాకే అమ్మకానికి పెడతారు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన తర్వాతే మామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలెబ్రిటీలు ఉచితంగా ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు. తమ వ్యాపారాన్ని భారీగా విస్తరించే పనిలో ఉన్నారు అంకిత, రీతూ. హైదరాబాద్ ఆఫీసు వ్యవహారాలను అంకిత పర్యవేక్షిస్తారు, నాగపూర్లోని సంస్థ బాధ్యతలు రీతూ చూసుకుంటున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకూ ‘యాజ్ దె గ్రో’ను తీసుకెళ్లాలన్నది ఆ సోదరీమణుల ఆలోచన.