క్యాన్సర్ వ్యాధి చాలా సందర్భాల్లో ముదిరే దాకా బయటపడదు. అయితే, తరచూ పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్లాంటి రుగ్మతలను తొలి దశలోనే కనిపెట్టవచ్చు. కానీ, ఇక్కడ రేడియేషన్ ఓ తీవ్ర సమస్య. ఆ ఇబ్బంది లేకుండా, తక్కువ ఖర్చుతోనే రొమ్ము క్యాన్సర్ను సులభంగా గుర్తించగలిగే ‘థర్మాలైటిక్స్’ అనే పరికరాన్ని తయారు చేసింది బెంగళూరుకు చెందిన నిర్మయి సంస్థ. డాక్టర్ గీతా మంజునాథ్, నిధి మాథుర్ దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకొంటారు. క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. ఈ నేపథ్యంలో ఓ సరికొత్త పరికరం గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు చేసే మమోగ్రామ్లాంటి టెస్టులు శరీరాన్ని బాధకు గురిచేస్తాయి. రోగులు అసలు తట్టుకోలేరు. కానీ శరీరానికి ఎలాంటి కోతా పెట్టకుండా, రేడియేషన్ ఉపయోగించకుండా, అసలు శరీరాన్ని తాకాల్సిన అవసరమే లేకుండా..
అతి సులభంగా బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించగల పరికరం.. థర్మాలైటిక్స్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ పరికరం రొమ్ము థర్మల్ ఇమేజెస్ ఆధారంగా క్యాన్సర్ను నిర్ధారిస్తుంది. ఇంతకు మునుపు ఉన్న ఎక్స్రే మమోగ్రామ్లు 45 సంవత్సరాలలోపు వారిలోనూ, డెన్స్ బ్రెస్ట్ (తంతి కణజాలం ఎక్కువగా ఉండటం) ఉన్నవారి విషయంలోనూ సమర్థంగా పనిచేయలేక పోయాయి. అంతేకాదు ఈ పరీక్షలు అంత సౌకర్యంగానూ ఉండవు. కానీ దీనికి భిన్నంగా థర్మాలైటిక్స్ రొమ్ము భాగంలోని ఉష్ణోగ్రత ఆధారంగా క్యాన్సర్ను నిర్ధారించగలదు. కాబట్టే, భారత ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి శరవేగంగా క్లియరెన్స్ వచ్చేసింది. సాధారణ టెస్టుల్లో కనిపించే కణితికన్నా ఐదురెట్లు చిన్నవాటిని కూడా ఈ పరికరం గుర్తించగలదని చెబుతున్నారు డాక్టర్ గీత.
ఆ వార్త కదిలించింది..
‘క్యాన్సర్ బాగా ముదిరిపోయే దాకా బయటపడదన్న మాట నిజమే అయినా, అప్పటి వరకూ మహిళలు అసలు టెస్టులకే వెళ్లకుండా ఉండటానికి ప్రధాన కారణం.. ఆ పరీక్షలు బాధాకరమైనవి కావడం. ఆర్థిక ఇబ్బందులనూ కాదనలేం’ అంటారు నిర్మయి సంస్థ సహ-వ్యవస్థాపకురాలు గీతా మంజునాథ్. గీతకు ఐటీ ఇన్నోవేషన్లో పాతికేండ్ల అనుభవం ఉంది. ఈ పరికరాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచన వచ్చే సమయానికి ఆమె హెల్త్కేర్ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం గురించి కొంత కృషి చేశారు. వెబ్ కెమెరాల ఆధారంగా అప్పుడే పుట్టిన బిడ్డల హృదయ స్పందనను తెలుసుకునే పైలట్ ప్రాజెక్ట్కూ పనిచేస్తున్నారు.
సరిగ్గా అప్పుడే పిడుగులాంటి వార్త విన్నారు. తన దగ్గరి బంధువుకు బ్రెస్ట్ క్యాన్సర్ అనీ, అది కూడా బాగా ముదిరిపోవడంతో.. కొద్దికాలం మాత్రమే బతికే అవకాశం ఉందనీ తెలిసింది. ఆ బాధను భరిస్తూనే.. క్యాన్సర్ను ముందుగా ఎలా గుర్తించవచ్చనే కోణంలో అధ్యయనం చేశారు. అడ్వాన్స్డ్ థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా ఇదంతా సాధ్యమని ఆమెకు అర్థమైపోయింది. ఇదే విషయం మీద రెండున్నరేండ్లు అధ్యయనం చేశారు. తనలానే ఆలోచించే నిధి మాథుర్లాంటి వాళ్లను టీమ్లో భాగం చేసుకున్నారు. అలా 2017లో నిర్మయిని ప్రారంభించారు.
అందరికీ అందుబాటులో
థర్మాలైటిక్స్ పరికరం సాయంతో ఇప్పటివరకూ 70 వేల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేశారు. క్యాన్సర్ నిర్ధ్దారణ పరీక్షల్ని సులభతరం చేయడానికి అపోలో, మేదాంత, రెయిన్బోలాంటి వివిధ వైద్యశాలలతో కలిసి పనిచేస్తున్నారు. అంతేకాదు ఈ సంస్థ స్మైల్-100 అనే మరో పరికరాన్ని కూడా తయారు చేసింది. థర్మల్ సిగ్నల్స్ను ఉపయోగించి.. రోగిలో క్యాన్సర్ ఏ దశలో ఉందన్నది నిర్ధారించడంలో ఈ సాంకేతికత ఎంతో సాయపడుతుంది. దీనికి అమెరికా ఎఫ్డీఏ అనుమతి కూడా లభించింది. నిర్మయి సేవలు కెన్యా, టర్కీ, స్వీడన్ తదితర దేశాలకూ విస్తరించాయి. ప్రతి మహిళకూ స్క్రీనింగ్ టెస్టుల్ని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతారు డాక్టర్ గీత.