మూత్రపిండాలు.. శరీరంలో అత్యంత ప్రధానమైనవి. వెన్నెముకకు రెండువైపులా.. పక్కటెముకల కిందిభాగంలో అమరి ఉంటాయి. తీవ్రంగా గాయపడటం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం, చక్కని జీవనశైలి ద్వారా మూత్రపిండాలను రక్షించుకోగలం.
మూత్రపిండాల్లో తరచూ మంట, ఇన్ఫెక్షన్, మూత్రనాళాల్లో అవరోధాలు, ప్రొస్టేట్ గ్రంథి వాపు, మధుమేహం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, ఆల్పోర్ట్స్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు.. కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి.
వ్యాయామం
నడక, పరుగు, సైక్లింగ్, డ్యాన్స్ లాంటి శారీరక వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గించుకోవడానికి సాయపడతాయి. గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. ఇవి రెండూ కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసేవే.
చక్కెర స్థాయి నియంత్రణతో రక్తంలో చక్కెర స్థాయులు అదుపు తప్పితే మధుమేహ రోగులలో మూత్రపిండాలు దెబ్బతినే ఆస్కారం ఎక్కువ. దీంతో రక్తాన్ని శుద్ధి చేయడానికి మూత్రపిండాలు మరింత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంచుకుంటే ఈ ముప్పును తప్పించుకోవచ్చు.
అదుపులో రక్తపోటు
అధిక రక్తపోటు మూత్రపిండాల వైఫల్యానికి కారణం అవుతుంది. ఉప్పు తక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఊబకాయానికి చెక్
ఊబకాయంతో బాధపడుతున్న వారికి ఎన్నో వ్యాధులు ముమ్మరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఆహారంలో సోడియం తక్కువగా ఉండాలి. మరపట్టని ధాన్యం ఉపయోగించాలి. మాంసాన్ని వారంలో ఒకటిరెండు రోజులకు పరిమితం చేయాలి. తాజా పండ్లు, కూరగాయలు భోజనంలో భాగం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఉపవాసం చేసినా మంచిదేనంటారు.
తరచుగా పరీక్షలు
డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం, మూత్రపిండాల వ్యాధుల చరిత్ర ఉన్నవారు, 50 ఏండ్లు దాటినవారు తరచుగా మూత్రపిండాల స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. శరీర వ్యవస్థలో ఏ చిన్నపాటి తేడా వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
పొగాకు ఉత్పత్తులకు..దూరంగా
ధూమపానం వల్ల రక్తనాళాలు పాడైపోయి, ఎథెరోస్క్లెరోసిస్కు దారితీస్తుంది. ఇది మూత్రపిండాల గుండా రక్త ప్రవాహం తగ్గిపోవడానికి కారణం అవుతుంది. అలా మూత్రపిండాల వ్యాధి ముప్పు పెరిగిపోతుంది. కాబట్టి, పొగాకు పగాకే.
పెయిన్ కిల్లర్స్ వద్దేవద్దు
నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) రకానికి చెందిన ఐబుప్రొఫెన్, నాప్రోగ్జెన్, మెఫెనామిక్ యాసిడ్, డైక్లోఫినాక్, ఎసెక్లోఫెమాక్ లాంటి బాధా నివారిణులను మోతాదుకు మించి వాడకూడదు. వీటి వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. వైద్యుల సిఫారసుతోనే నొప్పి నివారణ మాత్రలు కొనాలి.
నీళ్లు తాగండి
తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలో హైడ్రేషన్ సక్రమంగా ఉంటుంది. ఫలితంగా ఒంట్లో పేరుకు
పోయిన అధిక సోడియం, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు మూత్రపిండాలకు వీలుపడుతుంది. ఎక్కడికెళ్లినా మంచినీళ్ల సీసా తీసుకెళ్లాల్సిందే.