వరంగల్లు యాత్ర ఇతివృత్తంగా రాసిన క్రీడాభిరామంలో- కాకతీయ ప్రభువుల మొగసాల మీద గడియారం మోగిన విషయాన్ని పేర్కొన్నారు. ఆనాటి మేటి మాట నేటికీ సాకారమవుతున్నది. నిజాం హయాంలో సుబేదార్ బంగ్లామీద ఠంచన్గా పనిచేసిన పెద్ద గడియారం.. మళ్లీ టిక్.. టిక్.. అంటున్నది. గంట గంటకూ గంటలు కొడుతూ నగరవాసులకు కొత్త అనుభూతిని పంచుతున్నది. ఒకప్పుడు సామాన్య జనాలు సమయం తెలుసుకోవాలంటే.. నింగిలోకి చూడటం ఒక్కటే మార్గంగా ఉండేది. పొద్దువాలిన తీరును బట్టి వేళాపాళా అంచనా వేసేవారు. అప్పటి ప్రభుత్వాలు నగరాల ప్రధాన కూడలిలో భారీ గోడ గడియారాలు ఏర్పాటు చేస్తుండేవి. అవి క్లాక్టవర్ సెంటర్లుగా ప్రాచుర్యం పొందాయి. నిజాం రాజుల ప్రాంతీయ పాలనా కేంద్రం వరంగల్లో 1884లో.. సుబేదార్ బంగ్లా మీద పెద్ద గడియారాన్ని ఏర్పాటుచేశారు. దశాబ్దాలపాటు కాలంతో పరుగులు తీసిన ఆ గడియారం పదేండ్ల కింద ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్జాగా పనిచేస్తున్నది. ప్రస్తుతం హనుమకొండ జిల్లా కలెక్టరేట్గా ఉన్న సుబేదార్ బంగ్లాపై కొత్త గడియారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. హైదరాబాద్కు చెందిన జీపీఎస్ గడియారాల సంస్థ ‘రమేశ్ స్విస్ వాచ్ గ్యాలరీ’ దీనిని ప్రత్యేకంగా తయారు చేసింది. ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు గంటకోసారి.. ఎన్ని గంటలన్నది టంగ్ టంగ్మంటూ అందరికీ తెలియజేస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలగొద్దని అర్ధరాత్రి సమయంలో అలారం మోగకుండా ఏర్పాటు చేశారు. గంటకొట్టి మరీ గత స్మృతులను గుర్తుచేస్తున్న సుబేదార్ కొత్త గడియారాన్ని హనుమకొండ వాసులు సెల్ఫోన్లలో క్లిక్ మనిపిస్తున్నారు.
– పిన్నింటి గోపాల్