శ్రీహరి దేవదేవుడైనా.. వైకుంఠం పెత్తనమంతా శ్రీమహాలక్ష్మిదే! జమాఖర్చులన్నీ ఆమె అధీనంలో ఉండబట్టే.. యుగయుగాలుగా శ్రీనివాసుడు స్థితి కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించగలుగుతున్నాడు! ఇంటి పెత్తనం ఇంతికి కట్టబెడితేనే ఆర్థికాంశాలు పట్టుతప్పకుండా ఉంటాయి. సిరులతల్లిని ఆదర్శంగా తీసుకోండి. ఆర్థికమంత్రిగా మీరు వేసే పొదుపు మంత్రాలు వరలక్ష్మిని మీ ఇంట్లో స్థిరంగా ప్రతిష్ఠిస్తాయి.
శ్రావణ వరలక్ష్మిని మనసారా ఆరాధిస్తే ఆ తల్లి అనుగ్రహం దక్కుతుంది అనడంలో సందేహం లేదు. శ్రీదేవి ఇచ్చిన వరాలను అనుభవించే శక్తియుక్తులూ ఉండాలి. వరలక్ష్మీ వ్రతంలో ఆ తల్లిని అష్టోత్తర శతనామాలతో అర్చిస్తుంటారు. వాటిలో ‘ఓం శ్రద్ధాయై నమః’ అని కీర్తిస్తారు. ఈ నామం అర్థాన్ని గ్రహిస్తే, ఇంటి ఇల్లాలు ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. ఏ పనిచేసినా శ్రద్ధ అత్యవసరం. శ్రద్ధ, ఆసక్తి కలవారినే కనక మహాలక్ష్మి అనుగ్రహిస్తుందని శాస్త్ర వచనం. వరలక్ష్మీ వ్రతకథలోని చారుమతి వృత్తాంతం ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. పెద్దలపై ఆమె చూపించే భక్తిప్రపత్తులే లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణంగా కనిపిస్తాయి.
ఈ కాలం స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటి బాధ్యతలను పంచుకుంటున్నారు. కానీ, సంపాదించడంతోనే తన పాత్ర పూర్తయిందని భావిస్తున్నారు మహిళలు. పొదుపు చేయడం వరకే తన పని అని, మదుపు చేయడాలు, ఆర్థిక వ్యవహారాలు నడిపించడాలు అన్నీ ఇంటాయనకే వదిలేస్తున్నారు. సంసారంలో, సంపాదనలో సగం భారం వహిస్తున్నప్పుడు ఆర్థిక వ్యవహారాల్లోనూ కీలకం కావడం తప్పనిసరి. అలాగని కట్టుకున్నవాడిపై పూర్తిస్థాయిలో పట్టుబిగించేయకండి. అల వైకుంఠపురంలో లక్ష్మీనారాయణుల కాపురాన్ని ఆదర్శంగా తీసుకోండి. మంచిమాటతో దారికి తెచ్చుకోండి.
సంపాదన మాత్రమే లక్ష్మి కాదు. సంతానమూ ఆమె స్వరూపమే! శాంతమూ ఆవిడే! ‘యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ అని అమ్మవారిని స్తుతించారు రుషులు. అందరి ఇష్టదైవమైన శ్రీదేవి అష్టరూపాల్లో కొలువుదీరిన ఇంట నిరంతరం సంతోషాలు వెల్లివిరు స్తాయి. అష్టలక్షులకు ప్రతీకగా నిలిచే వరలక్ష్మి ఇంటి ఇల్లాలే! ఆమె సౌభాగ్యమే.. ఆ ఇంటిల్లిపాదికి వైభోగం.