బరువు తగ్గడానికి అన్నం మానుకుని చపాతీలు తినడం మొదలుపెట్టాం. అంతేకాదు డయాబెటిస్ని తప్పించుకోవడానికీ, అధిక క్యాలరీలు తగ్గించుకోవడానికీ అన్నం మానేస్తున్నాం. అది సరే గానీ, చపాతీ తిని అనుకున్నది సాధిస్తున్నామా? అనే సందేహం కూడా కొందరిలో ఉంది. దీనికితోడు గోధుమ పిండి రొట్టెలు మంచివా? గోధుమలతోపాటు ఇతర ధాన్యాలు కలిపి పట్టించిన పిండి మంచిదా? అని ఆరా తీసేవాళ్లూ, డైటీషియన్లను సలహా కోరే వాళ్లూ ఉన్నారు. ఇంతకూ డైటీషియన్లు ఈ సందేహానికి ఏమని సలహాలిస్తున్నారు? సాధారణ గోధుమపిండిలో అధిక పీచు పదార్థాలు ఉంటాయి. అన్నం కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి.
మల్టీ గ్రెయిన్ ఫ్లోర్లో గోధుమలతోపాటు ఓట్స్, బార్లీ, రాగి, జొన్నలు కూడా ఉంటాయి. మల్టీ గ్రెయిన్ పిండి వల్ల అధిక ఫైబర్తోపాటు కొద్దిగా ఇతర పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. డయాబెటిస్, ఒబెసిటీ బాధితులకు గోధుమ రొట్టెలు మంచిదే. మల్టీ గ్రెయిన్ పిండి అంతకంటే మంచిది! కానీ, మల్టీ గ్రెయిన్ పిండి తయారీలో అధికంగా ప్రాసెస్ చేస్తే ఆ పోషకాలు ఉండకపోవచ్చు. గోధుమలు, ఓట్స్, రాగులు, జొన్నలు, బార్లీ గ్లిజమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ. కాబట్టి ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయి కూడా తక్కువగా ఉంటుంది. అంత మాత్రాన ఆరోగ్యంగా ఉండిపోతామని అనుకోవద్దు. ఎంత తింటున్నామన్నది కూడా ముఖ్యమని డైటీషియన్లు చెబుతున్నారు. కాబట్టి, శరీర బరువు, చేసే పనిని బట్టి ఆహారం తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.