ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం ఉండటాన్ని రవి-పుష్య యోగంగా పరిగణిస్తారు. దీనిని విశేషమైన రోజుగా చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 10, మే 8 తేదీల్లో రవి-పుష్య యోగం ఉంది. పుష్యమిని కాస్మిక్ నక్షత్రంగా చెబుతారు. 27 తారల్లో దీనిని శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. రవి-పుష్య యోగం ఉన్న రోజున చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని చెబుతారు. వ్యాపార ప్రారంభం, విస్తరణ పనులు ఈ రోజు మొదలుపెడితే విజయవంతంగా పూర్తవుతాయి.
ప్రతి రోజూ వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండ కాలం, అమృత ఘడియలు ఇలా పలు ప్రత్యేక సమయాలు ఉంటాయి. తెలుగు రాష్ర్టాల్లో ప్రధానంగా వర్జ్యం, దుర్ముహూర్తం పాటిస్తుంటారు. రాహుకాలం ఆచరించే సంప్రదాయం తమిళనాడులో కనిపిస్తుంది. కాలక్రమంలో అన్ని ప్రాంతాల వారూ రాహుకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇంతకీ రాహుకాలం ఎందుకు వదిలిపెట్టాలి? ఈ సమయంలో రాహు కారకత్వాలైన కార్యహాని, అగ్ని, మృత్యు, రోగ, రాజభయాదులు కలుగవచ్చు. అందుకే వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం పరిశీలించి శుభముహూర్తాలు నిర్ణయిస్తుంటారు పంచాంగ కర్తలు.
పూజగదిలో శంఖాన్ని ఉంచి, నిత్యం ధూపదీపాలను సమర్పిస్తే అరిష్టాలు తొలగిపోతాయని చెబుతారు. పూజలో ఉంచడానికి దక్షిణావర్త శంఖం శ్రేష్ఠమైనది. క్షీరసాగర మథనంలో పుట్టిన పద్నాలుగు రత్నాల్లో శంఖం కూడా ఒకటని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి ఉద్భవించిన కారణంగా శంఖాన్ని శ్రీలక్ష్మికి సోదరునిగా భావిస్తారు. అందుకే శంఖాన్ని పూజించడం లక్ష్మీప్రదమని భావిస్తారు. పూజల్లో, నీరాజన సేవలో శంఖాన్ని పూరిస్తారు. తాంత్రిక క్రియల్లోనూ దీనిని ఉపయోగిస్తారు.
ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టి ఉండటాన్ని గమనిస్తాం. గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గుమ్మడి శుభానికి సంకేతం. దృష్టి దోషాలను తొలగిస్తుందని నమ్మకం. అశుభాలను తొలగించి, శుభాలను ప్రసాదించే తత్తం గుమ్మడిలో ఉందని విశ్వాసం. ఆకారాన్ని బట్టి గుమ్మడికాయ భూగోళానికి ప్రతీకగా చెబుతారు. దానిలో అనంతమైన శక్తి ఉందని, అది దోషాలను పరిహరిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే ఇంటి గుమ్మానికి గుమ్మడిని కట్టే సంప్రదాయం స్థిరపడింది.
ఇంటిమీద గుడి నీడ పడకూదని చాలామంది చెబుతుంటారు. గుడి పవిత్రతను కాపాడటానికి వచ్చిన ఆచారం ఇది. గుడి నీడ పడేటంత దగ్గరగా ఇల్లు నిర్మించకుండా ఉండేందుకు ఈ నియమం ప్రచారంలోకి వచ్చింది. గుడి పవిత్ర ప్రదేశం. నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఊరిలోని వారంతా ఆలయానికి వస్తూ ఉంటారు. సాధారణంగా ఇండ్లలో అశుచి సోకక తప్పదు. ఆ ప్రభావం గుడిపై పడితే ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ఇబ్బందిని పరిహరించే ప్రయత్నంలో భాగంగా గుడి నుంచి ఇల్లు దూరంగా ఉండాలని పెద్దలు సూచించారు. అది ఇంటికి క్షేమమని చెబితే.. తప్పక పాటిస్తారని నియమంగా చేశారు. సమాజ శ్రేయస్సు, ఆలయ పవిత్రత దృష్ట్యా వచ్చిన సంప్రదాయం ఇది.
ధ్యానానికి ఏకాగ్రత చాలా అవసరం. మనసును నియంత్రించే శక్తి ఉండాలి. మంత్రోచ్ఛాటనకు ఏకాగ్రతతో పెద్దగా పనిలేదు. మంత్రోచ్ఛారణ చేస్తున్నప్పుడు పరిపరి విధాలుగా మనసు సంచరిస్తూ ఉంటుంది. ఆలోచనలూ కలుగుతుంటాయి. అవి వస్తూపోతూ ఉన్నా.. మంత్రం కొనసాగుతూనే ఉంటుంది. శబ్దానికి ఉన్న శక్తి వల్ల మంత్రం ఫలితాన్ని ఇస్తుంది. అయితే, సాధన తీవ్రమయ్యే కొద్దీ మంత్రోచ్ఛాటన సమయంలోనూ ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు మరింత త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. కోరికలు నెరవేరుతాయి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం (13/4/2022) మధ్యాహ్నం 3-46 గంటలకు గురువు పూర్వాభాద్ర నాలుగో పాదం మీనరాశిలోకి ప్రవేశంతో సార్ధ త్రికోటి తీర్థ సహిత ప్రణీతా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పన్నెండు రోజులు కొనసాగే ఈ పుష్కరాలు ఏప్రిల్ 24తో ముగుస్తాయి. ప్రణీతా నదే ప్రాణహిత. వార్ధా, వెన్గంగా నదుల కలయికతో ఏర్పడిన ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ప్రణీత నది ప్రాశస్త్యం గురించి మత్స్య, వాయు, వామన పురాణాలలో కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంతోపాటు పలు ప్రాంతాల్లో పుష్కరాలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ 12 రోజుల పుష్కర సమయంలో పితృ దేవతల ప్రీత్యర్థమై స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేయడం శ్రేయస్కరం.
జన్మ లగ్నం నుంచి కుజుడు 2-4-7-8-12 స్థానాల్లో ఉంటే కుజ దోషంగా పరిగణిస్తారు. చంద్ర లగ్నం నుంచి, శుక్ర లగ్నం నుంచి ఈ స్థానాల్లో ఉన్నా దోషమే అవుతుంది! వధూవరులిద్దరి జాతకంలో కుజ దోషం ఉంటే పరిహారంగా భావిస్తారు. ఒకరి జాతకంలోనే ఉన్నప్పుడు కుజుడు ఉన్న క్షేత్రాన్నిబట్టి పండితులు పలు పరిహారాలు సూచించారు. కుజుడు ఉచ్ఛ, స్వక్షేత్రం, మిత్రక్షేత్రాల్లో ఉంటే దోష పరిహారం. అలాగే కుజ-చంద్ర, కుజ-గురు, కుజ-బుధ యోగం ఉన్నా, కుంభ, సింహ రాశుల్లో పుట్టినా కుజదోషం లేదని శాస్త్రం చెబుతున్నది. వృషభ, తుల రాశుల వారికి 12వ స్థానంలో కుజుడున్నా దోషం ఉండదు. మేష, వృశ్చిక రాశుల వారికి 4వ స్థానంలో కుజుడుంటే దోషం ఉండదు. మకర, కర్కాటక రాశుల వారికి 7వ స్థానంలో, ధనుస్సు, మీన రాశుల వారికి 8వ స్థానంలో కుజుడు ఉన్నా దోషం పరిహారం.
కుజదోషం లేని నక్షత్రాలు: అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదు.
జన్మ నక్షత్రంలో..
చేయదగిన పనులు: యాగం, అన్నప్రాసన, వ్యవసాయం, ఉపనయనం, రిజిస్ట్రేషన్, అక్షరాభ్యాసం
చేయకూడని పనులు: సీమంతం, గర్భాదానం (నక్షత్ర ప్రథమార్థంలో చేయవచ్చు), క్షౌర కర్మ, ఔషధ సేవ, ప్రయాణం, వివాహం
స్త్రీలకు జన్మనక్షత్రంలో వివాహం శ్రేష్ఠమని పండితుల మాట.
వివాహం జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఆరు నెలల వరకు చెవులు కుట్టడం, ఉపనయనం, తీర్థయాత్రలు, నూతన వ్రతాలు ఆచరించడం, ఉద్యాపననలు మొదలైన కార్యక్రమాలు చేయకూడదు. సంవత్సర భేదం ఉంటే ఈ కార్యక్రమాలకు నిషిద్ధం లేదని కొందరి అభిప్రాయం.
కాలగణనలో దగ్ధయోగాలుంటాయి. ఆదివారం- ద్వాదశి, సోమవారం- ఏకాదశి, మంగళవారం- పంచమి, బుధవారం- తదియ, గురువారం- షష్ఠి, శుక్రవారం- అష్టమి, శనివారం- నవమి.. ఆయా రోజుల్లో పైన పేర్కొన్న తిథులుంటే వాటిని ‘దగ్ధయోగాలు’ అంటారు. ఈ రోజుల్లో దూర ప్రయాణాలు, యాత్రలు చేయకపోవడం శ్రేయస్కరం. విధి నిర్వహణలో భాగంగా చేసే ప్రయాణాలకు దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు. శుభకార్యం, క్షేత్ర సందర్శన కోసం వెళ్తున్నట్లయితే పాటించడం మంచిది. ఏదేమైనా దగ్ధయోగం ఉన్న రోజున ప్రయాణం చేయాల్సి వస్తే ఇష్టదైవాన్ని ధ్యానించి వెళ్లండి.
పురుషులకు:తలమీద-కలహం, బ్రహ్మరంధ్రం-మృత్యుభయం, ముఖం – ధనలాభం, ఎడమకన్ను- శుభం, కుడికన్ను-అపజయం, కుడి చెంప- దుఃఖం, ఎడమచెవి- లాభం, పైపెదవి- కలహం, కింది పెదవి- ధనలాభం, రెండు పెదవులపై- మృత్యు భయం, కుడి భుజం- ఆరోగ్యం, చేతిలో- ధన నష్టం, మణికట్టు- అలంకార ప్రాప్తి, మోచేయి- ధన నష్టం, చేతి వేళ్లు- స్నేహితుల సందేశం, తొడలు- వస్త్ర నాశనం, పాదాలు- కష్టం, కాలి వేళ్లు- రోగం.
స్త్రీలకు: తల- ప్రాణభయం, కొప్పు- రోగభయం, పిక్కలు- బంధు దర్శనం, ఎడమ కన్ను- భర్త ప్రేమ, కుడి కన్ను- మనోవ్యథ, ఛాతీ- సుఖం, కుడిచెంప- పుత్రలాభం, కుడిచెవి- ధనలాభం, పైపెదవి- శత్రుత్వం, కిందిపెదవి- నూతన వస్తులాభం, రెండుపెదాలు- కష్టం, వీపు- మరణవార్త, గోళ్లపై- కలహం, ఎడమచేయి- మనో చలనం, చేతివేళ్లు- భూషణ ప్రాప్తి, మోకాళ్లు- బంధనం, చీలమండ- కష్టం, కుడికాలు- శత్రునాశనం, కాలివేళ్లు- పుత్రలాభం
గమనిక: బల్లి శరీరంపై ఎక్కడ పడినా, వెంటనే తలస్నానం చేయాలి. దీపారాధన చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. శరీర భాగాలపై తొండ పాకినా ఇవే ఫలితాలు వర్తిస్తాయి.
వివాహమైన రోజు నుంచి 16 దినాల్లో నూతన వధువు సరి సంఖ్య రోజులో గృహ ప్రవేశం చేయాలి. చతుర్థి, షష్ఠి, చతుర్దశి మినహా మిగిలిన తిథులు అనుకూలం. సోమ, బుధ, గురు, శుక్ర, శని వారాల్లో ప్రవేశం మంచిది. అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 17 నక్షత్రాలు నూతన వధూ గృహప్రవేశానికి ప్రశస్తమని శాస్త్రం చెబుతున్నది. ముఖ్యంగా నూతన వధూ ప్రవేశానికి పగటి పూట కన్నా రాత్రి వేళ మంచిదని పెద్దల మాట.
గ్రామం (నివసించే ప్రాంతం/కాలనీ/ ఊరు) పేరు మీద వచ్చే నక్షత్రం మొదలు నామ నక్షత్రం వరకు లెక్కించి ఈ కింద తెలిపిన ప్రకారం ఫలితం తెలుసుకోవచ్చు. కొందరు నామ నక్షత్రం మొదలు గ్రామ నక్షత్రం వరకు కూడా లెక్కిస్తుంటారు.
1-5 శిరస్సు లాభం
6-8 ముఖం ధనక్షయం
9-13 కుక్షి ధనధాన్యప్రదం
14-19 పాదాలు దరిద్రం
20 వీపు భయం
21-24 నాభి సంపద
25 మూలస్థానం పీడ
26 కుడిచేయి దుఃఖం
27 ఎడమచేయి వివాదం
క్షౌరం చేయించుకోవడానికి ఉభయ పక్షాలలో విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, శుద్ధ త్రయోదశి, బహుళ పాడ్యమి శుభం. సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలం. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం నక్షత్రాలు శుభం.