కెప్టెన్ హర్ప్రీత్ చాందీ.. ‘పోలార్ ప్రీత్’గా సుపరిచితురాలు. ఈ పేరుతో తనను ప్రపంచానికి పరిచయం చేసింది ఆమె వెనకున్న సాహస గాథే. మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో దక్షిణ ధ్రువ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసిందామె. ఏకంగా 1397 కిలోమీటర్లు మంచుకొండల్లో ఒంటరిగా ప్రయాణించింది. భారత సంతతి మహిళ సాధించిన ప్రపంచ రికార్డు ఇది.
అంటార్కిటికాను దాటాలన్నది తన లక్ష్యమనీ, సమయాభావం వల్ల ఇంతవరకే పూర్తిచేయగలిగాననీ వివరిస్తుంది ప్రీత్. విరామాన్ని తగ్గించుకుని, నడక వేగం పెంచడం వల్లే ఈ రికార్డు సాధ్యమైనట్టు చెబుతుంది. ముప్ఫైమూడేండ్ల ప్రీత్ బ్రిటన్లోని డెర్బీ నగరంలో ఉంటున్నది. అక్కడ ఆర్మీ ఆఫీసరుగా, ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తున్నది. ఆమె ఘనతకు ప్రశంసగా డెర్బీషైర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. దక్షిణ ధ్రువాన నారీ భేరి మోగిస్తున్న ‘పోలార్ గర్ల్’కు మనమూ శుభాకాంక్షలు చెబుదామా!