ఎండాకాలం. ఎండలు మండే కాలం. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. కొన్ని చిట్కాలను పాటిస్తే సూర్యుడి భగభగల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆహారం, మంచినీళ్లు, ద్రవ పదార్థాలు, చలువనిచ్చే పండ్లు.. తల్లీబిడ్డలను కంటికి రెప్పలా కాపాడతాయి.
వికారం, వాంతులు
దాదాపు 70 శాతం గర్భిణులు ఈ సమస్యను ఎదుర్కొంటారు. వరుస వాంతుల వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దాంతో బలహీనమైపోయి దవాఖానలో చేరాల్సిన పరిస్థితి రావచ్చు.
అజీర్ణం-వాపు-ఆకలి తగ్గడం
గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల అన్నవాహిక, పొట్ట, పేగుల ద్వారా ఆహారం నెమ్మదిగా కదులుతుంది. దీంతో పేగుల్లో కండరాలు వదులు అయిపోయి ఆమ్లం, ఆహారం కలిసిపోతాయి. ఫలితంగా గుండెలో మంటగా అనిపిస్తుంది. గర్భం పెరిగేకొద్దీ పొట్టను పైకి నొక్కడం జరుగుతుంది. గర్భిణికి అసౌకర్యంగానూ ఉంటుంది.
నంజు (ఈడెమా)
మొదటి మూడు నెలల్లో పాదాలు, కాళ్లలో ద్రవాలు పేరుకుపోతాయి. పాదాలు, కాళ్లు, వేళ్లు, ముఖం బాగా ఉబ్బిపోవడం అన్నది అధిక రక్తపోటుకు సంకేతం. వాపు భరించలేనంతగా ఉన్నా, విశ్రాంతి తీసుకున్నా కూడా వాపు తగ్గకపోయినా వైద్యుణ్ని సంప్రదించడం మంచిది.
శ్వాస మందగించడం
గర్భాశయం పెరగడం వల్ల ఊపిరితిత్తులు నొక్కుకుపోతాయి. ఫలితంగా శ్వాస పరిమాణం తగ్గిపోతుంది. దానికితోడు అధిక ఉష్ణోగ్రతలు. దీంతో గర్భిణులకు బాగా ఉక్కపోతగా అనిపిస్తుంది. పడుకున్నప్పుడు శ్వాస సరిగ్గా ఆడని పరిస్థితి నెలకొంటుంది.
వేడిగా అనిపించడం
కొంతమందికి తరచూ వేడిగా, చెమటగా అనిపిస్తుంది. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణుల శరీరంలో లీటరు నుంచి 1.5 లీటర్ల రక్తం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.
ఇవీ పరిష్కారాలు..
నీళ్లు, పండ్ల రసాలతో హైడ్రేషన్
వేడితో పోరాడాలంటే శరీరంలో తగినంత నీటి శాతం (హైడ్రేషన్) ఉండాలి. నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తదితర ద్రవ పదార్థాలతో శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి. పుష్కలంగా నీళ్లు తాగినా.. పండ్ల రసాలు, నీటి శాతం ఎక్కువగా ఉన్న తాజా కూరగాయలు తీసుకోవడం చక్కటి పరిష్కారం. అయితే, చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాల వల్ల మరింత దాహం అవుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి, వాటికి వీలైనంత వరకు దూరం ఉండాలి.
చన్నీటి స్నానం
ఎండాకాలపు వేడిని తట్టుకోవడానికి సులభమైన మార్గమిది. మరీ వేడిగా, మరీ చల్లగా కాకుండా గది ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉన్న నీటితో స్నానం చేయడం మంచిది. చన్నీటి జల్లులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయని మరిచిపోకూడదు. ఎందుకంటే, శరీరం చన్నీటికి అనుగుణంగా ఉష్ణోగ్రతను మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. సూర్యోదయానికి ముందు, పడుకోవడానికి ముందు చేసే చన్నీటి స్నానాలు సైతం కొన్ని గంటలపాటు ఉల్లాసాన్ని ఇస్తాయి. ఇక షవర్ స్నానం అయితే.. షెవర్ హెడ్ను మొదట పాదాల నుంచి మొదలుపెట్టాలి. తర్వాత కాళ్లు, భుజాలపై నీళ్లు పడేలా చూసుకోవాలి. పొట్ట భాగంపై చివరగా నీళ్లు పోసుకోవాలి. అదీ షవర్ను గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేస్తున్నట్లు చేస్తే మంచిది. అసౌకర్యంగా అనిపిస్తే అంతటితో ఆపేయాలి.
నూలు బట్టలు
బట్టలు బిగుతుగా ఉండకూడదు. శ్వాస బాగా ఆడేలా, శరీర అవయవాలు సరిగ్గా కదిలేలా ఉండాలి. చెమటను పీల్చుకునే నూలు బట్టలు ఉత్తమం. చర్మానికి గాలి సోకేలా తేలికపాటి వస్ర్తాలు ధరించాలి.
మితమైన వ్యాయామం
డాక్టర్ చెప్పేంత వరకు శారీరక వ్యాయామాన్ని మానవద్దు. కడుపులో పిండం పెరగడం వల్ల బరువు పెరుగుతుంటారు. కాబట్టి, దానికి సంబంధించిన మందకొడితనం, అలసటను తట్టుకోవడానికి కొన్నిరకాల వ్యాయామాలను సిఫారసు చేస్తారు నిపుణులు. ముఖ్యంగా రక్త ప్రసరణను మెరుగుపరిచే కసరత్తులు ఉత్తమం. నడక, ఈత గర్భిణులకు మంచి చేస్తాయి.
విశ్రాంతి
రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కునుకుతీయాలి. పడుకునే చోట గాలీ వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. వైద్యుణ్ని క్రమం తప్పకుండా సంప్రదించాలి. ఏవైనా అవాంఛనీయ లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్కు తెలియజేయాలి.
తేలికైన ఆహారం
మరీ ఆలస్యంగా తినకూడదు. ఉపాహారంలోనూ పోషకాలు ఉండాలి. ఆ తర్వాత, మరో మూడు గంటలు తినడం ఆపేయాలి. రోజుకు ఐదుసార్లు ఆహారం తీసుకోవడం మంచిది. వీటిలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాల్సిందే. తేలికైన మాంసకృత్తులను విస్మరించకూడదు.