ప్రాణాంతకంగా పరిణమించే ఊపిరితిత్తుల వ్యాధులను కచ్చితంగా కనిపెట్టడమే కాదు, ఆ రుగ్మతలను రూపుమాపే అత్యాధునిక చికిత్సా విధానం ‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ’. ఈ పద్ధతిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగానే గుర్తించి, సమర్థంగా చికిత్సఅందించవచ్చు. స్వైన్ ఫ్లూ మొదలు మందులకు లొంగని ఉబ్బస వ్యాధి వరకూ ప్రతి సమస్యకూ ఇది పరిష్కారం చూపుతుంది.
ఓ గృహిణి ఏడాది నుంచీ న్యుమోనియాతో బాధపడేది. మందులు వాడినప్పుడు కొంతమేర తగ్గినట్టు అనిపించినా, మళ్లీ తిరగబెట్టి పదేపదే పీడించేది. దీంతో జీవితం నరకంగా మారింది. శ్వాసకోశ వ్యవస్థ సమర్థంగా పనిచేయకపోవడంతో శరీరం నీలం రంగులోకి మారిపోవడం మొదలుపెట్టింది. చివరికి సమస్య ప్రాణాంతకమైంది. వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వైద్యులు తేల్చిచెప్పిన విషయం ఆమెను నిర్ఘాంతపరిచింది. ఏడాది క్రితం ఓ రోజు భోజనం చేస్తున్నప్పుడు శ్వాసనాళంలో చిక్కుకుపోయిన ఓ కందిపప్పు బద్ద ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం వల్లే ఈ ఇబ్బంది తలెత్తింది. పైకి చిన్న సమస్యగానే అనిపించినా చివరికి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇలాంటి ఉదంతాలు అనేకం. పసిపిల్లలు పొరపాటున పిన్నీసు మింగేస్తుంటారు. అవి కాస్తా శ్వాసనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇంకొందరు భోజన సమయంలో టీవీ చూస్తూనో, కబుర్లు చెప్పుకుంటూనో నవ్వేస్తుంటారు.
దీంతో పొలమారిపోయి.. అన్నవాహికలోకి వెళ్లాల్సిన ఆహారం శ్వాసనాళాల్లో చేరిపోతుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. లక్షణాలు కూడా సాధారణ దగ్గును పోలి ఉండటంతో చికిత్స పక్కదారి పడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సమస్య మూలాలను కచ్చితంగా కనిపెట్టగలిగే పరీక్ష.. బ్రాంకోస్కోపీ.పరీక్ష, చికిత్స ఒకేసారి బ్రాంకోస్కోపీ ద్వారా.. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే శ్వాసనాళాల పనితీరును పరీక్షించవచ్చు. ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలి గొట్టాలనూ స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు లేదా వస్తువులను కనిపెట్టి, వెంటనే బయటికి తీయగల ‘టూ ఇన్ వన్’ టెక్నిక్ ఇది. ఈ చికిత్సను ‘రిజిడ్ బ్రాంకోస్కోపిక్ ఫారిన్ బాడీ రిమూవల్’ అంటారు.
ఇలా ఇరుక్కునే వాటిలో పల్లీలు, కూరగాయ ముక్కలు, మాంసం తునకల వంటివి ఉంటే.. ఆర్గానిక్ అనీ; లోహపు ముక్కలు, పిన్నీసులు, చెక్కముక్కల లాంటివైతే.. నాన్ ఆర్గానిక్ ఫారిన్ బాడీస్ అనీ వ్యవహరిస్తారు. రెండిటిలో ఆర్గానిక్ పదార్థాలు ఎక్కువ ప్రమాదకరం. ఇవి శ్వాసనాళాల్లోనే కుళ్లిపోతాయి. దీంతో వాటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా వివిధ రసాయనాలు విడుదలై కెమికల్ న్యూమొనైటిస్ అనే తీవ్ర సమస్య ఉత్పన్నం అవుతుంది. నాన్ ఆర్గానిక్ బాడీస్ ఇలా కుళ్లిపోవు. అయితే చికిత్స ఆలస్యమయ్యేకొద్దీ ఊపిరితిత్తుల్లో కొంత భాగానికి గాలి అందక న్యుమోనియా సమస్య వస్తుంది. అయితే వీటిని ఎక్స్రేలో కనిపెట్టవచ్చు. అదే ఆర్గానిక్ పదార్థాలు ఎక్స్రేలో కనిపించవు. కానీ, ఊపిరితిత్తుల్లో ఆ పదార్థం పక్కనున్న భాగం నల్లగా మసి పూసినట్టు ఉంటుంది. ఆ ఆనవాళ్లను బట్టి వాటిని బ్రాంకోస్కోపీ ద్వారా తొలగించవచ్చు.
రెండు రకాలు
బ్రాంకోస్కోపీ రెండు రకాలు. రోగి వయసును బట్టి, ఇరుక్కున్న పదార్థం పరిమాణాన్ని బట్టి మత్తు ఇచ్చి కానీ, ఇవ్వకుండా కానీ తొలగిస్తారు. మత్తు ఇచ్చి చేసేది.. రిజిడ్ బ్రాంకోస్కోపీ. మత్తు లేకుండా ఎండోస్కోపీ పద్ధతిలో చేసేది.. ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ. రిజిడ్ విధానంలో లోహపు గొట్టాన్ని లోనికి పంపి, అడ్డుగా ఉన్న పదార్థాన్ని బయటికి లాగేస్తారు. ఐదేండ్లలోపు పిల్లల్లో గాలి గొట్టాలు చిన్నగా ఉంటాయి. దానికితోడు వాళ్లు చికిత్సకు సహకరించరు. కాబట్టి మత్తు తప్పనిసరి. సాధారణంగా పెద్దవాళ్లకు మత్తు ఇవ్వకుండానే ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో పెద్దలకు సైతం మత్తు అనివార్యం కావచ్చు
ఏం చేస్తారు?
బ్రాంకోస్కోపీకి 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఫారిన్ బాడీ సైజు, మింగిన తర్వాత వైద్యులను కలిసిన సమయాన్ని బట్టి నష్టాన్ని అంచనా వేస్తారు. కాబట్టి దగ్గు, న్యుమోనియా పదేపదే తిరగబెడుతున్నా, మందులకు లొంగక ఇబ్బంది పెడుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. నిపుణులు బ్రాంకోస్కోపీ ద్వారా గాలి గొట్టాలను పరీక్షించి, అడ్డంకిని కనిపెట్టడంతోపాటు ఆ అవరోధాన్ని తొలగిస్తారు. ఇంత సత్వర పరిష్కారం బ్రాంకోస్కోపీలోనే సాధ్యం. పూర్వం దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యకు సర్జరీ తప్పనిసరి అయ్యేది. ఛాతీని తెరిచి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చేది. బ్రాంకోస్కోపీ అందుబాటులోకి వచ్చాక సర్జరీతో పని లేకుండానే సమస్యను కనిపెట్టడం, సరిదిద్దడం.. ఏకకాలంలో రెండు పనులూ వీలవుతున్నాయి. అవసరమైతే, ఈ పద్ధతిలో క్యాన్సర్ గడ్డనూ తొలగించొచ్చు. కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోని స్పాంజ్ లోపల క్యాన్సర్ గడ్డలు ఏర్పడుతాయి. వీటిని కీమో, రేడియేషన్ లేదా సర్జరీ ద్వారా తొలగిస్తారు. కొన్ని క్యాన్సర్లు ఊపిరి తీసుకునే గొట్టాల లోపల పుడతాయి. శ్వాసకు అడ్డుపడుతూ రోగికి నరకాన్ని చూపిస్తాయి. వీటిని సర్జరీ అవసరం లేకుండానే, రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా సమూలంగా తొలగించవచ్చు.
ఇమ్యునోగ్లోబ్యులిన్ థెరపీ
కొంతమందికి ఇన్హేలర్లు కూడా అదుపు చేయలేనంతగా ఉబ్బసం పెరిగిపోతూ ఉంటుంది. ఆ దశ దాటి తరచూ ఊపిరి అందక హాస్పిటల్ పాలవుతారు. ఇలాంటి వాళ్లకు రెండు రకాల చికిత్సలు ఉన్నాయి. వైద్యుల సలహా ప్రకారం.. ఇమ్యునోగ్లోబ్యులిన్ జిని బ్లాక్ చేసే ఇంజెక్షన్లను నెలకు ఒకటి లేదా రెండు ఏడాది పాటు తీసుకోవచ్చు. దీన్ని ‘ఇమ్యునోగ్లోబ్యులిన్ థెరపీ’ అంటారు. ఇది కూడా పనిచేయని దశలో ‘బ్రాంకియల్ థర్మోప్లాసీ’ అనే అత్యాధునిక చికిత్సా విధానాన్ని ఎంచుకోవాల్సిందే. ఉబ్బసం పదేపదే తిరగబెట్టడం వల్ల గాలి గొట్టాల చుట్టూ ఉండే కండరాలు గట్టిగా మారిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడానికి అనువుగా సంకోచ వ్యాకోచాలు చెందలేవు. గాలి ఓ పట్టాన ఊపిరితిత్తుల్లోకి వెళ్లలేదు. ఫలితంగా ఎన్ని మందులు వాడినా ఉబ్బసం అదుపులోకి రాదు.
ఆస్తమా దాడి అంతకంతకూ పెరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉండాల్సిన దుస్థితీ వస్తుంది. ఇలాంటప్పుడు గట్టిపడిన ఆ కండరాలను కాల్చి, గాలి గొట్టాలకు స్వేచ్ఛ ప్రసాదించడం ఒక్కటే మార్గం. ఆ పని బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ద్వారా చేయవచ్చు. ఈ చికిత్సలో ఎండోస్కోపీ పద్ధతిలోనే ఊపిరితిత్తుల్లోకి బ్రాంకోస్కోపీని పంపి, వేడి ద్వారా గాలి గొట్టాలను కుంచించేలా చేస్తున్న కండరాలను బలహీనపరుస్తారు. చికిత్సను మూడు దఫాలుగా, మూడు వారాల వ్యవధితో చేస్తారు. మొదటివారం కుడి పక్క కింది భాగం, రెండోసారి ఎడమ పక్క కింది భాగం, మూడోసారి రెండువైపుల పైభాగాలకూ చికిత్స చేస్తారు.
ఇలా కండరాలను బలహీనపరచడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు. పైగా బ్రాంకియల్ థర్మోప్లాస్టీ వల్ల ఆస్తమా దాడులు తగ్గ్గుతాయి. ఇన్హేలర్లు వాడాల్సిన అవసరం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా హాస్పిటలైజేషన్ బాధ తప్పుతుంది. జీవన నాణ్యత పెరుగుతుంది. ఈ చికిత్స ఒక్క రోజులోనే పూర్తయిపోతుంది. సాయంత్రానికి దవాఖాన నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆతర్వాత వైద్యుల సూచనలు పాటిస్తూ, అలర్జీ కారకాలకు దూరంగా ఉండాలి. దాంతోపాటే ఆరోగ్యకర జీవనశైలిని కొనసాగించాలి. గాలి వడపోతకు మాస్క్ వాడాలి.
ఉబ్బసానికి వీడ్కోలు
ఉబ్బసం లేదా ఆస్తమా నుంచి పూర్తిగా బయటపడేసే సరికొత్త చికిత్సా విధానమూ అందుబాటులోకి వచ్చింది. అదే.. బ్రాంకియల్ థర్మోప్లాస్టీ. దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఎడతెగని తుమ్ములు, తెమడ.. తదితర లక్షణాలు సాధారణ దగ్గులోనూ కనిపిస్తాయి. అయితే అది ఉబ్బసమా కాదా అని నిర్ధారించుకోవడానికి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఐజీయీ అనే మరో పరీక్ష కూడా ఉంటుంది. దీనిద్వారా మన శరీరంలోని ఇమ్యునోగ్లోబ్యులిన్ అనే ప్రొటీన్ తీరును కనిపెట్టవచ్చు. అలర్జీ ఏ స్థాయిలో ఉంది.. ఇన్హేలర్ కాకుండా ఇతర మందులు అవసరమా అనేది ఈ పరీక్ష సాయంతో గుర్తించవచ్చు. ఒక్కసారి వ్యాధి నిర్ధారణ జరిగితే మొదట ఇన్హేలర్ చికిత్స తీసుకోవాలి. వీటికి అలవాటు పడితే ఆరోగ్యానికి మంచిది కాదని భయపడుతుంటారు చాలామంది. ఇది అపోహే. నోటిమాత్రల కంటే వేగంగా ప్రభావం చూపే విధానమిది. వీటిలోని స్టెరాయిడ్స్ రక్తంలో కలవకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకే వెళ్తాయి కాబట్టి, దుష్ప్రభావాలు ఉండవు.
-డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్,యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్.