మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పులు.. కారణం ఏదైనా కావచ్చు. ఈ మధ్యకాలంలో రకరకాల వైరస్లు చుట్టుముడుతున్నాయి. కొన్నయితే జంతువులు, పక్షులు తదితర జీవరాశుల నుంచీ వ్యాపిస్తున్నాయి. అలా, జంతువుల ద్వారా వచ్చే వైరస్.. మంకీపాక్స్. వైద్య ప్రపంచాన్ని కలవరపెడుతున్న మహమ్మారి ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే మంకీపాక్స్ను అంతర్జాతీయ విపత్తుగా ప్రకటించింది. నిజానికి, ఈ వైరస్ ప్రపంచానికి కొత్తేం కాదు. మన దేశంలో మాత్రం ఎప్పుడూ రాలేదు. తాజాగా కేరళలో తొలికేసు నమోదైంది. అసలు మంకీపాక్స్ అంటే ఏమిటి, ఎలా సోకుతుంది, వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్సా విధానాలు ఎన్నిరకాలు? తదితర ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిద్దాం.
మంకీపాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కూడా స్మాల్పాక్స్ కుటుంబానికి చెందినదే. దాదాపుగా తట్టు, అమ్మవారు లాంటిదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నందువల్ల ‘జూనోటిక్’ వ్యాధిగా పరిగణిస్తారు. జంతువుల నుంచి మనుషులకే కాదు, మనుషుల నుంచి మనుషులకూ సంక్రమిస్తుంది. ఈ వైరస్ను మొట్టమొదట 1958లో కోతులలో గుర్తించారు. అందుకే ‘మంకీపాక్స్’ అనే పేరొచ్చింది. తొలుత ఈ వైరస్ కోతుల నుంచే మనుషులకు సోకింది. 1970లో తొలిసారిగా వైరస్ను మనుషుల్లోనూ గుర్తించారు. కోతులతోపాటు ఎలుకలు, ఉడతల ద్వారా కూడా మనుషులకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ ఎక్కువగా మధ్య ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలలో కనిపిస్తుంది. ప్రపంచంలో తొలి కేసు అక్కడే నమోదైంది. ఇది పక్కా అంటువ్యాధి. రోగి శరీరమంతా వ్యాపించడానికి 6 నుంచి 13 రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో 21 రోజులు కూడా పట్టవచ్చు. ఇప్పటికే దాదాపు అరవై దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు మన దేశంలోనూ అలజడి సృష్టిస్తున్నది.
చికిత్సా పద్ధతులు
మంకీపాక్స్కు ప్రత్యేక చికిత్సా విధానమంటూ లేదు. చికెన్పాక్స్, స్మాల్పాక్స్కు అందించే వైద్యాన్నే ఈ వైరస్ సోకిన రోగులకూ ఇస్తారు. సపోర్టింగ్ ట్రీట్మెంట్, యాంటీ వైరల్ డ్రగ్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కొనసాగిస్తారు. రోగి పరిస్థితి తీవ్రంగా ఉంటే ఐవీ (ఇంట్రావీనస్) పెడతారు. కొన్నిరకాల యాంటీ వైరల్ డ్రగ్స్కు ఇంకా అనుమతి రావలసి ఉంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే వాటిని కూడా భాగం చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి అయితే అమ్మతల్లి వంటి వైరస్లకు ఇచ్చే చికిత్స ఒక్కటే శరణ్యం. ఆ సమయంలో రోగులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లు, చేతులు, ముఖంపై ఏర్పడిన బొబ్బలు పగిలిపోకుండా జాగ్రత్త పడాలి. వాటిపై మంట వచ్చినప్పుడు నిపుణులు సిఫారసు చేసిన పైపూత మందులు వాడాలి. వీటితోపాటు సూచించిన విటమిన్ మాత్రలు వేసుకోవాలి. జ్వరంగా ఉంటే పారాసిటమాల్ గోళీ వేసుకోవచ్చు. ఈ వ్యాధి పెద్ద ప్రమాదకారి ఏం కాదు. భయాందోళనలు అవసరం లేదు. ఒకటి రెండు వారాల్లోనే రోగి కోలుకుంటాడు. అయితే ప్రతి 10మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ఆస్కారం లేకపోలేదు. అందుకని నిర్లక్ష్యం వహించకూడదు.
వ్యాధి నిర్ధారణ
కరోనా, డెంగీలానే మంకీపాక్స్ను నిర్ధారించేందుకు ప్రత్యేక కిట్స్ ఉంటాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలను కూడా ‘రియల్ టైమ్ పాలిమరైజ్ ఛేంజ్ రియాక్షన్'(ఆర్టీపీసీఆర్) పద్ధతిలో చేస్తారు. రోగి నుంచి సేకరించిన నమూనాలను మంకీపాక్స్ కిట్లో పెట్టి ఆర్టీపీసీఆర్ యంత్రం సాయంతో నిర్ధారిస్తారు.
తక్షణ చర్యలు
దేశంలోనే తొలికేసు కేరళలో నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్ను నోడల్ కేంద్రంగా ప్రకటించింది. మంకీపాక్స్ కేసులకు చికిత్స అందించేందుకు అక్కడ 20 పడకలతో ప్రత్యేక ఐసొలేషన్ వార్డును అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాల నిర్ధారణ పరీక్షలకు గాంధీ దవాఖానలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని బట్టి, ఫీవర్ హాస్పిటల్తో పాటు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఐసొలేషన్ వార్డులను సిద్ధం చేస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంకీపాక్స్ మనల్ని ఏమీ చేయలేదు. ఆరోగ్యకర జీవనశైలితో.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే మనల్ని మనం రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం.
– డాక్టర్ కె.శంకర్ సూపరింటెండెంట్,
ప్రొఫెసర్ & హెచ్ఓడీ ఆఫ్ మెడిసిన్
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, హైదరాబాద్
– మహేశ్వర్రావు బండారి