పచ్చని ప్రకృతికి ఆలవాలమైన తిరుగిరులు పర్యావరణానికి పట్టుగొమ్మలు. ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయడి సేవలనూ పర్యావరణహితంగా నిర్వహిస్తున్నారు. ఆనంద నిలయంలో మాత్రమే కాదు, ప్రసిద్ధమైన స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా సేంద్రియ దినుసులతోనే తయారు చేస్తున్నారు. గోవిందుడి సేవలో పూర్తిగా గోవుల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.
సుప్రభాత సేవ నుంచి పవళింపు వరకు ఆనంద నిలయుడికి జరిగే కైంకర్యాలు కోకొల్లలు. నవనీత హారతి, తోమాలసేవ, నివేదనలు, వసంతోత్సవాలు, దీపాలంకరణ సేవలు.. ఇలా ఘడియ ఘడియకు ఏదో ఒక సేవలో స్వామి ఓలలాడుతూ ఉంటారు. ఈ సేవలన్నిటినీ ఇప్పుడు పర్యావరణ హితంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోశాలను అభివృద్ధి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారికి సమర్పించే వెన్న దేశీ గోవుల పాల నుంచి తయారు చేస్తుండటం విశేషం. తిరుమల గోశాలలో సుమారు 108 దేశవాళి జాతులకు చెందిన వందలాది గోవులను పోషిస్తున్నారు. ‘నవనీత సేవ’ స్కీంలో భాగంగా పలమనేరులో 450 ఎకరాల సువిశాల ప్రాంగణంలో గోశాల నిర్వహిస్తున్నది టీటీడీ. ఇక్కడి గోవులకు ఇచ్చే ఆహారం కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించిందే కావడం విశేషం.
గోశాల నుంచి సేకరించిన గోమూత్రం, గోమయం నుంచి పంచగవ్య ఉత్పత్తులను తయారుచేసి రైతులకు అందిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన వ్యవసాయ ఉత్పత్తులనే స్వామి కైంకర్యాల్లో వాడుతున్నారు. శ్రీవారి సేవలో ప్రతిరోజూ సుమారు 950 కిలోల పూలను వినియోగిస్తుంటారు. వాడిపోయిన పూలతో అగరుబత్తీలు, ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. మొత్తానికి తిరుమల శ్రీనివాసుడి సన్నిధానం పర్యావరణహిత కేంద్రంగా విలసిల్లుతున్నది.