ఇదొక శాడిస్టు అయిన డెంటిస్టు కథ. సమాజంలో గౌరవం. తరగని ఆస్తిపాస్తులు. అనుకూలవతి అయిన భార్య. ఎవరైనా ఇంతకుమించి ఏం కోరుకుంటారు? కానీ అనుమాన పిశాచం అతణ్ని కటకటాల పాలు చేసింది. కన్నబిడ్డ ఇచ్చిన సాక్ష్యంతో యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం.
ఉమేశ్ ముంబైలో మంచి ప్రాక్టీస్ ఉన్న డెంటిస్ట్. సంపాదన బాగానే ఉండేది. అతని భార్య తనూజ. ఓ కార్పొరేట్ కంపెనీలో అకౌంటెంట్. ఆ దంపతులకు ఓ బాబు. బయటికి అంతా బాగానే ఉండేది. పార్టీలకూ ఫంక్షన్లకూ భార్యనూ, కొడుకునూ తీసుకెళ్లేవాడు. నలుగురి మధ్యా ఆప్యాయత కురిపించే వాడు. నాలుగు గోడల చాటున మాత్రం.. అతనో నరమృగం. భార్య నవ్వినా, ఏడ్చినా అనుమానమే. కాస్త అలంకరణ చేసుకుని ఆఫీసుకు బయల్దేరితే చాలు. ఏవో సూటిపోటి మాటలు. ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకొంటూ.. గడపదాటేది ఆ ఇల్లాలు. ఓ దశలో ఆ బిడ్డ తనకు పుట్టలేదంటూ గొడవపడ్డాడు. పసివాడికి డీఎన్ఏ టెస్ట్ చేయించాడు. ఆ పరీక్షలో బిడ్డ తండ్రి ఉమేశ్ అనే తేలింది. అయినా ఆ రాక్షసుడు నమ్మలేదు. రిపోర్ట్ తారుమారు చేశారంటూ భార్యను తిట్టేవాడు, కొట్టేవాడు. దీంతో తనూజ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. భర్తకు దూరంగా బతకసాగింది. అయినా ఆ రాక్షసుడు వదల్లేదు. ఓ రాత్రి ఆమె ఇంట్లోకి జొరబడి కత్తితో దాడి చేశాడు. నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు.
పోలీసులకు ఫోన్ చేసి వ్యూహాత్మకంగా లొంగిపోయాడు. విచారణలో తన మానసిక స్థితి సరిగాలేదని చెప్పాడు. ఆ మేరకు డాక్టర్ సర్టిఫికెట్ కూడా సమర్పించాడు. ఇలాంటి సందర్భాలలో న్యాయస్థానం అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటుంది. మానసిక రోగుల పట్ల ఎంతోకొంత సానుభూతి చూపుతుంది. కానీ, పసివాడి వాంగ్మూలం కేసులో కీలకంగా మారింది. ‘నాన్న ఆరోగ్యంగానే ఉండేవారు. ఓ రోజు మా ఇంటికొచ్చి.. నన్ను గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ సమయానికి నాన్న చేతిలో కత్తి ఉంది. దాంతోనే అమ్మను పొడిచాడు’ అని కోర్టుకు వివరించాడు. ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆ సాక్ష్యాన్ని పరిగణన లోకి తీసుకుంది. ఉమేశ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.