వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఓ మోస్తరు రోగానికి కూడా లక్షల బిల్లులు వేస్తున్నారు. ఏ శస్త్రచికిత్సో అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కానీ, ఆ క్లినిక్లో మాత్రం.. పది రూపాయలకే వైద్య సేవలు అందిస్తారు. అవసరమైతే రాయితీతో సర్జరీలూ చేయిస్తారు. సికింద్రాబాద్ నేరేడ్మెట్ పరిసరాల్లో ‘పది రూపాయల దవాఖాన’ పేదల హృదయాలను గెలుచుకుంటున్నది.
సఫిల్గూడ దాటాక, నేరేడ్మెట్ ప్రారంభంలోనే.. ఎడమ వైపున అంబేడ్కర్ భవన్ కనిపిస్తుంది. దానికి ఆనుకొని చిన్న గది. ఓ పదిమంది వరకూ వరుసలో నిలబడి ఉన్నారు. తలెత్తితే.. ‘పది రూపాయల క్లినిక్’ అనే ఫ్లెక్సీ. లోపలికి వెళ్లి చూస్తే.. పట్టుమని పాతికేండ్లు కూడా లేని ఓ డాక్టరమ్మ. ఓ వృద్ధుణ్ని స్టెతస్కోప్తో పరీక్షిస్తున్నది. తన ఒంట్లోని బాధలన్నీ ఏకరువు పెడుతున్నాడు పెద్దాయన. ఓర్పుగా వింటూ చిరునవ్వుతో సమాధానం ఇస్తున్నది డాక్టరమ్మ. బీపీ చెక్ చేసి, మందులు రాసిచ్చింది. వెళ్లబోతూ జేబులోంచి పది రూపాయల నోటు తీసి డాక్టరమ్మ చేతిలో పెట్టాడు. తర్వాత ఓ పాప వంతు. పొడిపొడిగా దగ్గుతూ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్నది. ఆ కబుర్లను ఆస్వాదిస్తూనే కళ్లు పరీక్షించింది డాక్టరమ్మ. నోట్లో టార్చిలైటు వేసి చూసింది. స్టెతస్కోప్తో హృదయ స్పందన తెలుసుకుంది. ప్రిస్క్రిప్షన్ రాసి పాప తండ్రి చేతిలో పెట్టింది. ఆయన యాభై రూపాయలు ఇవ్వబోయాడు. ‘వద్దండీ! ఇక్కడ పది రూపాయలే తీసుకుంటాం’ అంటూ సున్నితంగా తిరస్కరించింది. అందు లోంచి పది రూపాయల నోటు మాత్రమే తీసుకుంది. రోగులందర్నీ చూడటం అయిపోయాక.. ఆ క్లినిక్ గురించి ఇలా వివరించింది డాక్టర్ రోజ్లిన్..
“గోపాల్ యాదవ్ అనేక హాస్పిటల్స్లో మేనేజర్గా చేశారు. మందులు కొనడానికి కూడా డబ్బులు లేని పేదల కష్టాలను చూశారు. వారి తరఫున మేనేజ్మెంట్తో మాట్లాడి బిల్లులు తగ్గించేవారు. నరేశ్ కూడా పదేండ్ల నుంచీ వైద్యరంగంలో ఇలాంటి సంఘటనలు అనేకం గమనించారు. ఇద్దరూ కలిసి తమ వంతుగా సమాజానికి మంచి చేయాలనుకున్నారు. వేతనాల్లో సగ భాగాన్ని పేద రోగుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనతోనే, ఇటీవల పది రూపాయల క్లినిక్ను ఏర్పాటు చేశారు. తొలుత నన్నే సంప్రదించారు. అప్పటికే నేను వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో నా స్నేహితురాలిని పంపాను. తను కొన్నాళ్లపాటు వైద్యం అందించింది. ఆమె ప్రమోషన్పై వెళ్లడంతో మళ్లీ నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను. కానీ, బంధువులేమో ‘లక్షల రూపాయల వేతనం వదిలి.. ఇప్పుడేం సేవ?’ అని నిరుత్సాహ పరిచారు. అమ్మ మాత్రం నాకే మద్దతు తెలిపింది. ఈ క్లినిక్కు నేరేడ్ మెట్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ రోగులు వస్తుంటారు. మనసులోని బాధలన్నీ నాతో చెప్పుకొంటారు. అవన్నీ ఓర్పుగా వింటూ మనసుకు, శరీరానికి తగిన చికిత్స అందిస్తా. వారిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగిస్తా. మేం ఇరవై ఏండ్లుగా నేరేడ్మెట్లోనే ఉంటున్నాం. అమ్మానాన్నలకు ఐదుగురు ఆడపిల్లలం. చిన్ననాటి నుంచీ నాకు డాక్టర్ కావాలని కోరిక. అమ్మ నన్ను కష్టపడి చదివించింది. నేనూ శ్రద్ధగా చదువుకున్నాను. చివరికి నా కల నెరవేరింది.
ఆడపిల్ల పుడితే వైద్యం ఉచితం
అవును. మా క్లినిక్లో గర్భిణిగా నమోదు చేసుకొని, ఇక్కడే చెకప్లు చేయించుకుంటే దగ్గర్లోని ‘సన్ఫ్లవర్ మల్టీ స్పెషాలిటీ’ హాస్పిటల్లో రాయితీ ఇస్తారు. ఒకవేళ ఆడపిల్ల పుడితే వైద్యం పూర్తిగా ఉచితం. మందుల వరకూ కొనుగోలు చేస్తే చాలు. పేదలను దృష్టిలో ఉంచుకుని ఆ దవాఖాన మేనేజ్మెంట్తో ఒప్పందం చేసుకున్నాం. అప్పుడప్పుడూ ఉచిత ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాం. రోగం నయం అయిన తర్వాత కృతజ్ఞతగా మరికొంత డబ్బు ఇవ్వబోతారు చాలామంది. మేం సున్నితంగా తిరస్కరిస్తాం. ఎందుకంటే ఇది పది రూపాయల క్లినిక్. అంతకుమించి ఒక్కపైసా కూడా తీసుకోం. క్లినిక్ను తెలుగు రాష్ర్టాల్లో విస్తరించాలనే నిశ్చయంతో ఉన్నారు గోపాల్, నరేశ్. సేవా భావం కలిగిన వైద్యులు ముందుకొస్తే త్వరలోనే మరిన్ని దవాఖానాలు ప్రారంభం అవుతాయి.
ఆ వైద్యులు.. రోగులతో సమానం!
‘రోగిని ప్రేమించలేని వైద్యుడు కూడా రోగితో సమానమే’ అనే నానుడి ఉంది. అపోహలతో, భయాలతో దవాఖాన వరకూ వెళ్లి, గంటలకొద్దీ వరుసలో నిలబడి.. తీరా కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్లాక.. పట్టుమని పది నిమిషాలు కూడా చూడరు చాలామంది డాక్టర్లు. ఆ విధానానికి నేను వ్యతిరేకం. రోగి బాధను పూర్తిగా తెలుసుకోకుండా వైద్యం చెయ్యలేం. రోగితో మనస్ఫూర్తిగా మాట్లాడలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఇక్కడివారు నన్ను తమ ఫ్యామిలీ డాక్టర్గానే భావిస్తారు. యువ వైద్యులు సంపాదనకే పరిమితం కాకుండా కొంత సమయాన్ని పేదల కోసం కేటాయించాలని నా విన్నపం.
– డాక్టర్ రోజ్లిన్, పది రూపాయల డాక్టర్
– డప్పు రవి