‘ప్రతి ముప్పై సంవత్సరాలకూ బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమావాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ గ్యాప్ అంటారు. అయితే, ప్రతీ జనరేషన్లోనూ ఓ ఆలోచనను ముందుకు తీసుకెళ్లేవారు అతికొద్దిమందే ఉంటారు. వాళ్లనే టార్చ్బేరర్స్గా అభివర్ణిస్తారు. ఈ సినిమా డైలాగ్ ఇప్పుడెందుకు? అంటే.. డ్రాగన్ ఫ్రూట్ పుట్టిన దేశాల్లోనూ ఆ ఫలానికి సంబంధించిన ఉప ఉత్పత్తులు లేవు. తొలిసారిగా తెలంగాణకు చెందిన మనస్విని రెడ్డి డ్రాగన్ ఫ్రూట్స్తో సౌందర్య సాధనాలు తయారు చేస్తున్నారు. ఆ గులాబీ ఫలం (డ్రాగన్ ఫ్రూట్) తొక్క, తోలు, గుజ్జు, రసం.. ఏదీ వృథా కానివ్వకుండా రైతన్నలకు అండగా నిలుస్తున్నారు.
మనస్విని తండ్రి శ్రీనివాస రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఆరుట్లలో డ్రాగన్ ఫ్రూట్స్ (గులాబీపండు) పండించి రికార్డు సృష్టించారు. ఓ ఆరోగ్య ఫలాన్ని జనానికి పరిచయం చేశారు. క్రమంగా ఈ పండువల్ల లాభాలు అందరికీ తెలిశాయి. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో ఎంతోమంది రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఇది కాయ నుంచి పండుగా రంగు మారేందుకు నాలుగైదు రోజుల సమయమే తీసుకుంటుంది. ఆ లోగా మార్కెట్ చేసుకోవాల్సిందే. లేకపోతే పగుళ్లు వస్తాయి. ఇక విక్రయానికి పనికిరావు. దీంతో కొన్నిసార్లు వృథా ఎక్కువగా ఉండేది. తండ్రితోపాటు మిగిలిన రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో.. డ్రాగన్ ఫ్రూట్తో ప్రయోగాలు ప్రారంభించారు మనస్విని. ఆ ప్రయత్నంలో విజయం సాధించారు కూడా. ఆ ప్రయోగాల ఫలితమే.. ‘నేచురల్ హ్యూస్ బై మన్నూ’ స్టార్టప్.
రైతుల కోసమే
రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన వనిపల్లి మనస్విని రెడ్డికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయంపై మక్కువ. క్లినికల్ న్యూట్రిషన్లో పీజీ చేశారు. కరోనా సమయంలో ఆమె తండ్రి సేద్యం సంక్షోభంలో పడింది. మిగిలిన రైతుల పరిస్థితీ అంతంతమాత్రమే. ఆయన పండించిన డ్రాగన్ ఫ్రూట్స్ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్టు మీది పండు చెట్టు మీదే పగిలిపోతుంటే.. రైతుకు గుండె పగిలినంత పనయ్యేది. దీంతో తనే రంగంలోకి దిగారామె. ఆ పండ్లతో సౌందర్య సాధనాలు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఫామ్హౌస్లో ఓ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు. తొలి దశలో ఇబ్బందులు ఎదురైనా.. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ప్రొఫెసర్ల సాయం తీసుకున్నారు. అందరి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించారు మనస్విని. విస్తృత పరిశోధనల ఫలితంగా.. డ్రాగన్ ఫ్రూట్తో సబ్బులు, ఫేస్స్క్రబ్, బాత్సాల్ట్, లిప్ స్క్రబ్, లిప్బామ్, జామ్, వైన్, క్లీనింగ్ మాస్క్ వంటి అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. నిజానికి, డ్రాగన్ ఫ్రూట్ను ఎక్కువగా పండించే థాయిలాండ్, తైవాన్లలోనూ ఇలాంటి ఉత్పత్తులు లేవు. తన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో మార్కెటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం naturalhues పేరుతో ఇన్స్టాగ్రామ్లో డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. తన తండ్రితో పాటు చుట్టుపక్కల గ్రామాల డ్రాగన్ ఫ్రూట్ రైతులకు మేలు చేసే ఉద్దేశంతో తమ ఫామ్హౌస్లో కోల్డ్ స్టోరేజ్ వసతిని కల్పిస్తున్నారు మనస్విని. దీనిద్వారా చుట్టు పక్కల గ్రామాల్లో ఓ వందమందికి ఉపాధి లభిస్తుంది. వందల టన్నుల పంటను నిల్వ చేయొచ్చు. గిట్టుబాటు ధర ఉన్నప్పుడే అమ్ముకోవచ్చు. గుజరాత్కు చెందిన ఆరోచ్ ఆగ్రో ప్రొడక్ట్స్వారు కూడా ఆరుట్ల వచ్చి మనస్విని ఉత్పత్తులను పరిశీలించారు. ‘మార్పును అర్థం చేసుకోగలిగితేనే మార్కెట్లో నిలబడతాం. కొత్త ఆలోచనలే ఆంత్రప్రెన్యూర్కు ప్రాణం’ అంటారు మనస్విని.
కార్పొరేట్ స్థాయిలో
ముందుగా మా ఉత్పత్తులకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తాం. ఆ తర్వాత కార్పొరేట్ స్థాయిలో స్టోర్స్ ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన ఉంది. ఇప్పటి వరకూ చాలా ఖర్చు చేశాం. త్వరలోనే వీహబ్ను సంప్రదిస్తాం. ఆ సంస్థ
ఆర్థికంగా సాయం చేస్తే.. మా పని మరింత సులువు అవుతుంది. ప్రజలకు నాణ్యమైన, సేంద్రియ సౌందర్య సాధనాలు అందించడమే మా లక్ష్యం. డ్రాగన్ ఫ్రూట్కే పరిమితం కాకుండా మరిన్ని పండ్లపై ప్రయోగాలు చేసే ఆలోచన ఉంది. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తే.. రైతులకు మరింత మేలు చేసినదాన్ని అవుతాను.
– వనిపల్లి మనస్విని రెడ్డి, సీయీవో, నేచురల్ హ్యూస్
– రవికుమార్ తోటపల్లి