చాలామంది గుండె, కాలేయం, మూత్రపిండాలను కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపుతారు. కానీ క్లోమ గ్రంథి(పాంక్రియాస్)ను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చి, ప్రతీ కణాన్ని ఉత్తేజితం చేసే క్లోమానికి కష్టం వచ్చిందంటే దేహం సగం చచ్చుబడిపోయినట్టే. పొత్తికడుపులో ఉండే క్లోమాన్ని సంరక్షించుకుంటే పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.
కాఫీటీలు, మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లు.. మసాలాలు, వేపుళ్లు అధికంగా తినడం తదితర కారణాల వల్ల దేహంలో ఎసిడిటీ పెరిగిపోతుంది. ఈ స్థితిలో క్లోమం వాపునకు గురై, పనితీరు మందగిస్తుంది. దీనివల్ల హార్మోన్లు, జీర్ణరసాల స్రావాలు తగ్గిపోతాయి. తిన్నది అరగక, శరీరానికి కావాల్సిన శక్తి అందదు. ప్రొటీన్ల లోపంతో కండరాల బలహీనత వస్తుంది. కొవ్వు పదార్థాలు తగ్గిపోయి బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని క్లోమ గ్రంథిని కాపాడుకునేలా అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.