ఒక్కొక్కరుగా ఉంటే ఓడిపోతాం. అందరం ఒక్కటైతే గెలుస్తాం.. ఈ మాటను వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చదువుతాం. కానీ సిద్దిపేట పల్లెల్లో కళ్లారా చూస్తాం! వాళ్లంతా.. ఓడిపోయిన వాళ్లు. ఒంటరి వాళ్లు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. కానీ ఇదంతా గతం.వర్తమానంలో.. వాళ్లందరి సహకార స్ఫూర్తి ఓ విజయగాథ! నేలమ్మ మహిళా రైతుల సహకార సంఘం.. గెలుపు కథనిండా మట్టివాసనలే.
చెలకలో నీళ్లు పారాలంటే బోరు ధార పోయాలె. బోరు ఎండి, బోరు పక్కన బోరేసి బోరున ఏడ్చిన రైతులెందరో? భూమిలో వేళ్లు తడపడం ఒక భారమైతే, పంటపై తిష్టవేసిన చీడపీడల్ని పారదోలడం ఇంకో భారం. రసాయన మందులు పనిచేయక, పైరు పండక.. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుండేది సేద్యం. అప్పుల ఊబిలోంచి బయట పడలేక ఆత్మహత్యే పరిష్కారం అనుకున్న రైతులెందరో. ఆ పరిస్థితుల్లో.. పిల్లల బాధ్యత, వ్యవసాయ భారం భుజాన వేసుకున్న ఒంటరి మహిళల్ని ‘కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ (సీసీసీ)’ పలుకరించింది. సిద్దిపేట, చిన్న కోడూరు, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, నంగునూరు మండలాలకు వెళ్లి ముచ్చటించింది. సుస్థిర సేద్యమే అన్ని సమస్యలకూ పరిష్కారమని ఒంటరి మహిళా రైతులకు (రైతు ఆత్మహత్య బాధితులకు) కొత్తదారి చూపింది. ఆ స్ఫూర్తితో వివిధ మండలాలకు చెందిన ఇరవైమంది ఒంటరి మహిళా రైతులు కలిసి ‘నేలమ్మ మహిళా రైతు పరస్పర సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వల్ల పెట్టుబడి ఖర్చు పెరగడమే కాకుండా.. ఆరోగ్యమూ పాడవుతుందనే విషయం వాళ్లకు మొదట్లో అర్థం కాలేదు. మొత్తంగా కాకున్నా, కొంత సాగుభూమిలో కుటుంబానికి అవసరమైనంత పండించి చూడమని సీసీసీ వాళ్లకు సూచించింది. సంఘం పనితీరు నచ్చడంతో మరికొందరు మహిళా రైతులు ముందుకొచ్చారు. దీంతో ఒంటరి మహిళా రైతులే కాకుండా .. ఎకరం, అర ఎకరంలో సేద్యం చేస్తున్నవారినీ చేర్చుకున్నారు.
జహీరాబాద్, ముల్కనూరు తదితర ప్రాంతాల్లోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు నేలమ్మ ప్రతినిధులు. రైతులతో మాట్లాడి సుస్థిర సాగు పద్ధతులు తెలుసుకున్నారు. ఆ స్ఫూర్తితో ఆర్గానిక్ సేద్యం మొదలుపెట్టారు. ఇంటికి సరిపోయేన్ని గింజల్ని సాగుచేయడం మొదలుపెట్టారు. క్రమంగా విస్తీర్ణం పెంచు కుంటూ ఆర్థికంగా లాభపడ్డారు. ‘నేలమ్మ సంఘం’ కృషిని గుర్తించి కొందరు దాతలు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ డబ్బును బ్యాంకులో జమ చేసుకుని.. అవసరం ఉన్న రైతులకు వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. మేకల పెంపకానికి, గ్రామీణ వృత్తులకు ఆసరా అందిస్తున్నారు. దీంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పింది. పైరవీలు లేకుండా పెట్టుబడి దొరికింది. చన్నీళ్లకు వేన్నీళ్లు తోడైనట్టు వ్యవసాయంతోపాటు ఇతర పనుల ద్వారా ఆదాయం రావడంతో ఆ కుటుంబాలకు ఇంకొంత మేలు జరిగింది.
కోళ్లు, మేకలు, బర్రెలు పెంచుకునేందుకు 26 మంది మహిళా రైతులు రుణం తీసుకున్నారు. మల్లుపల్లికి చెందిన రేణుక వాళ్లలో ఒకరు. ఆమె అయిదు వేల రూపాయలతో రెండు మేకలు కొన్నది. వ్యవసాయం చేస్తూ వాటిని మేపుకొనేది. అయిదేండ్లలో మూగజీవాల సంఖ్య పదహారుకు పెరిగింది. వాటన్నిటినీ అమ్మి.. వచ్చిన డబ్బుకు ఇంకొంత జోడించి ఈ మధ్యనే ఇల్లు కట్టుకుంది! సంతోషి కథ కూడా ఇలాంటిదే. ఆమెకు అర ఎకరం భూమి ఉంది. వ్యవసాయం చేస్తుంది. పొలం పని లేనప్పుడు బీడీలు చుట్టేది. సంఘం ఆమెకు ఎనిమిది వేల రూపాయల రుణం ఇచ్చింది. వాటికి రెండువేలు కలుపుకొని రెండు మేకలు కొన్నది. తన దగ్గర ఇప్పుడు పద్దెనిమిది మేకలున్నాయి! ఈ విజయాలు చూసి, మహిళా రైతుల సంఘంలో చేరడానికి చాలామంది ముందుకొచ్చారు. ఎవర్నీ కాదనకుండా కలుపుకొంటూ పోయారు. ప్రస్తుతం నేలమ్మ సభ్యుల సంఖ్య 200 దాటింది! పట్టణాల్లో పచ్చళ్లు, స్వీట్స్కు పెరుగుతున్న డిమాండ్ను వ్యాపార అవకాశంగా మలుచుకునేందుకు.. పాకశాస్త్ర నిపుణులతో మహిళా రైతులకు పాఠాలు నేర్పిస్తున్నది నేలమ్మ. ‘ఇప్పటికే మూడు బృందాలకు శిక్షణ ఇప్పించి.. పాత్రలు,
పనిముట్లు కొనేందుకు రుణాలూ అందిస్తున్నాం’ అని వివరించారు నేలమ్మ సంఘం అధ్యక్షురాలు బాలమణి.
నేలమ్మ మహిళా రైతు సహకార సంఘం దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తుంది. పదహారు మంది కార్యవర్గ సభ్యుల సమష్టి నిర్ణయంతోనే ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. వ్యవసాయ, స్వయం ఉపాధి రుణాలు ఇస్తారు. ఏటా మార్చి, అక్టోబరు నెలల్లో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ప్రతి పైసా ఎలా ఖర్చు చేశారో వివరిస్తారు. గత ఏడాది సభ్యులు సిరిధాన్యాల సాగులో అడుగుపెట్టారు. వాటితో వివిధ తినుబండారాలు, పచ్చళ్లు తయారు చేసుకునేలా..నల భీములతో శిక్షణ ఇప్పిస్తున్నారు.
-నాగవర్ధన్ రాయల
-బింగి శ్రీనివాస్