వాళ్లంతా స్పెషల్ కిడ్స్. అయితేనేం ఆ చిన్నారుల్లో సృజనాత్మకతకు కొదువలేదు. ఆ బాలబాలికల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి.. మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత చేరువ చేసే మార్గాన్ని ఎంచుకున్నారు శంకర్ ఫౌండేషన్ నిర్వాహకులు. దాదాపు 270 మంది పిల్లలకు ఏదో ఒక పనిని అప్పగిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వినాయక చవితి, దీపావళి, రాఖీ పౌర్ణమి ఇలా ప్రధాన పండుగల వేళ ఆ చిట్టిచేతులకు గట్టి పనులు అప్పగించి వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఈ పిల్లలంతా ఇప్పుడు రాఖీలను ముచ్చటగా తయారు చేస్తున్నారు. తోబుట్టువుల బంధాన్ని ప్రతిబింబించే సూక్తులు జతచేసి రాఖీల తయారీలోనూ తాము ‘స్పెషల్’ అని నిరూపించుకుంటున్నారు.
మనోవికాసం తక్కువగా ఉన్న చిన్నారులకు బాసటగా నిలుస్తున్నది హైదరాబాద్లోని శంకర్ ఫౌండేషన్. పదేండ్లుగా ప్రతి పండుగకూ ‘స్పెషల్ కిడ్స్’తో వినూత్న ఉత్పత్తులను తయారు చేయిస్తున్నది. రాఖీ పండుగ సందర్భంగా ఈ పిల్లలు ఒకసారి కాగితాలతో రాఖీలను తయారు చేస్తే, మరోసారి కాగితపు గుజ్జుతో, ఇంకోసారి పేపర్ను ఉండలుగా చుట్టి, మరుసటి ఏడాది బాటిళ్ల మూతలతో రాఖీలు తయారు చేస్తూ వచ్చారు. ఈసారి రెజిన్తో లాకెట్ల రూపంలో రాఖీలను తయారు చేస్తున్నారు. పలువురు బాలికలు వీటిని అందంగా సిద్ధం చేశారు. మరికొందరు చిన్నారులు తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే కొటేషన్స్ను వాటికి జతచేశారు. పండుగ తర్వాత కూడా ఈ రాఖీలను మెడలో లాకెట్లా ధరించవచ్చు. కిటికీలు, దర్వాజలకు అలంకరణ కోసమూ ఉపయోగించుకోవచ్చు.
రీసైక్లింగ్ రాఖీలు
ఈ రాఖీలకు మరో ప్రత్యేకతా ఉంది. రీసైక్లింగ్కు ఉపయోగపడేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు తయారు చేసిన రాఖీలను.. బేగంపేట్లోని శంకర్ ఫౌండేషన్కు చెందిన శ్రద్ధ సెంటర్లో స్టాల్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఒక్కో రాఖీ ధర రూ.75. కానీ, స్పెషల్ కిడ్స్ సృజన నుంచి తయారైన వీటికి వెలకట్టలేమని అంటారు ఫౌండేషన్ ప్రతినిధులు. రాఖీలను చిన్నారుల తల్లిదండ్రులే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వచ్చిన ఆదాయాన్ని తిరిగి ఆ చిన్నారులకే ఇస్తుండటం మరో విశేషం. రాఖీలతోపాటు పేపర్ బ్యాగ్స్, జ్యూట్ బ్యాగ్స్ తయారీ.. తదితర పనులు అప్పగిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు. దీపావళి సందర్భంగా ఈ పిల్లలు ఆవుపేడ, ఆవు నెయ్యితో దివ్వెలను తయారు చేస్తారు. వినాయక చవితికి గోమయంతో గణేశుడి ప్రతిమలు సిద్ధం చేసి పర్యావరణహితమైన వెజిటెబుల్ రంగులు అద్దుతారు. ఇలా ప్రతి పండుగనూ స్పెషల్ చిన్నారుల్లో సరికొత్త ఆలోచనను నింపేలా, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, మన సంస్కృతిని పరిచయం చేసేలా నిర్వహిస్తున్న శంకర్ ఫౌండేషన్ను అభినందించాల్సిందే..!
… నాగోజు సత్యనారాయణ