మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది శరీరాన్నంతటినీ కప్పి, రక్షణ కవచంలా ఉండటమే కాకుండా.. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతూ, నీటిని, కొవ్వును నిల్వ ఉంచి, ‘డి’ విటమిన్ తయారీకి సైతం దోహదపడుతుంది. చర్మంలోని కింది పొర ‘డెర్మిస్’. ఇందులో రక్తం, లింఫ్ వ్యవస్థ, వెంట్రుకల కుదుళ్లు, స్వేదం, సెబాషియస్ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు సీబం, నూనెలను ఉత్పత్తి చేయడం వల్ల చర్మం పొడిబారకుండా, తేమగా ఉంటుంది. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల సీబమ్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, గడ్డలు వస్తాయి. ఇవి తీవ్రమైతే మచ్చలు, గుంటలు పడతాయి. అంతే కాకుండా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే హెచ్వీపీ వైరస్ వల్ల పులిపిర్లు ఏర్పడుతాయి. ఇవి కొందరిలో శాశ్వతంగా ఉండిపోయి, ఇతర చోట్లకు వ్యాపించగా.. మరికొంత మందిలో కొన్నిరోజుల తరువాత వాటంతట అవే రాలిపోతాయి.
పులిపిర్లతో..
సాధారణంగా పెసర గింజంత ఉండే ఈ పులిపిర్లు కొందరిలో గోల్ఫ్బాల్ పరిమాణంలో కూడా పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పులు, రక్తం కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన ట్యాగ్స్.. చర్మ క్యాన్సర్లకు దారితీస్తాయి. పుట్టుకతో వచ్చే మచ్చలు కాకుండా, 20 ఏళ్ల తరువాత మచ్చలు ఏర్పడి, అవి సరైన ఆకారంలో లేకుండా రంగు మారుతూ, రక్తం కారుతూ ఉబ్బెత్తుగా ఉంటే.. చర్మ క్యాన్సర్గా అనుమానించాల్సిందే.
అలాంటి గడ్డలను అనుమానించాల్సిందే
శరీరంలోని వివిధ ప్రాంతాల్లో సాఫ్ట్ టిష్యూలతో ఏర్పడే ‘లైపోమా’లు ప్రమాదకరం కాదు. చర్మం కింద కానీ, రొమ్ములో కానీ గడ్డలు మెత్తగా, కదులుతూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. చేతితో తాకినప్పుడు గట్టిగా ఉండటం, చర్మం లోపలి గడ్డ కదలకుండా ఉండటం, గడ్డలో మార్పులు కనిపిస్తూ ఉంటే వాటిని క్యాన్సర్ గడ్డల్లా అనుమానించాలి.
ఈ మార్పులు కనిపిస్తే…
గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. లైపోమాలు ఎలాంటి నొప్పినీ కలిగించవు. క్యాన్సర్ కణుతులు కూడా తొలి దశలో నొప్పిగా ఉండవు. కానీ, పెరిగే కొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపడం వల్ల తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. చికిత్సకూ త్వరగా లొంగవు.
ప్రమాదం తక్కువే..
మనదేశ ప్రజల శరీరాలలో ‘మెలనిన్’ ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్లు ప్రధానంగా ‘బేసల్ సెల్ కార్సినోమా’, ‘స్క్వామ్ సెల్ కార్సినోమా’ అనే రెండు రకాలుగా ఉంటాయి. ఇందులో 90శాతం బేసల్ సెల్ కార్సినోమా రకానికి చెందినవే!
అల్ట్రా వయోలెట్ కిరణాల వల్ల..
50 ఏండ్లు దాటిన తరువాత నాన్ మెలనోమా స్కిన్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అతి నీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు, బాగా తెల్లగా ఉన్నవారిలో, నీలం రంగు కండ్లు ఉన్నవారిలో, పురుషులలో ఎక్కువగా ఈ క్యాన్సర్లు కనిపిస్తుంటాయి.
పరీక్షలు తప్పనిసరి..
శరీరం మీద ఎక్కడైనా మార్పు కనిపిస్తే, ముఖ్యంగా ఎండ ఎక్కువగా పడే ప్రదేశాలలో చర్మం రంగులో మార్పుతోపాటు, మానిపోయిన పుండు, స్కిన్ ప్యాచ్లా ఉండి రక్తస్రావం జరిగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
100శాతం నయం చేయవచ్చు..
అనేక రకాల చర్మ క్యాన్సర్లను 100శాతం నయం చేయవచ్చు. క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించడమే కాకుండా మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను కూడా నశింపచేయడానికి లేజర్ చికిత్స చేయవచ్చు. అవసరమైతే రేడియేషన్, కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీని ఆయింట్మెంట్ రూపంలోనూ ఇవ్వవచ్చు. ప్రభావిత చర్మం అధికంగా ఉన్నప్పుడు సర్జరీ చేసి తొలగించిన తరువాత ఇతర భాగాల నుంచి చర్మాన్ని తీసి తొలగించిన చోట గ్రాఫ్టింగ్ చేస్తారు.
స్కిన్ క్యాన్సర్ రాకుండా జాగ్రతలు :
సూర్యరశ్మి నుంచి కాపాడేలా సన్స్క్రీన్ లోషన్లు, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
ఎండలో లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. గొడుగు, చలువ కండ్లద్దాలు, తలకు టోపీ ధరించాలి ఎండలో బయటికి వెళ్లకపోవడం ఉత్తమం.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98480 11421