శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తుల హృదయాల్లో ఆనందాన్ని, భక్తిని నింపే విశిష్ఠమైన పర్వదినం. భగవద్గీత ద్వారా జీవన మార్గాన్ని చూపిన జగద్గురువు శ్రీకృష్ణుడి అవతరణాన్ని స్మరించుకుంటూ భక్తులు ఉపవాసం, హరినామ సంకీర్తన, గీతా-భాగవత శ్రవణం, ప్రసాద సేవనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృష్ణుడి బోధనలను మన జీవితంలో ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గుర్తుచేసే సందర్భం కూడా జన్మాష్టమి.
శ్రీకృష్ణుడు అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకుని సమస్త మానవాళి హితవు కోసం భగవద్గీతను అందించాడు. గీత కేవలం ఒక పురాతన గ్రంథం కాదు, ఇది మానవ దేహాన్ని ధరించిన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ‘జీవన మార్గదర్శిని’. కాలం, దేశం, వయసు లాంటి పరిమితులకు అతీతంగా ఈ ఉపదేశాలు మానవులకు మానసిక శాంతిని, మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గాన్ని చూపిస్తాయి. అందుకే ఈ లోకమంతా ఆ పరమాత్మను ‘జగద్గురువు’అనికీర్తిస్తుంది.
కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గమని శ్రీచైతన్య మహాప్రభువులు ప్రబోధించారు. శ్రీచైతన్య మహాప్రభువుల వారు బోధించిన శిక్షాష్టకంలో హరినామాన్ని జపించడానికి కుల, మత, వర్ణ, జాతి విబేధాలు ఏవీ అడ్డుకాదని, ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన నామ సంకీర్తనంలో పాలుపంచుకోగలరంటూ సమస్త మానవాళికీ పిలుపునిచ్చారు. ఆ దివ్య భక్తి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లడంలో శ్రీల ప్రభుపాదుల వారి కృషి అమోఘం.
నేటి యువత చదువు, ఉద్యోగాలు, సంబంధాలలో తీవ్రమైన ఒత్తిడిని, అస్థిరతను అనుభవిస్తున్నారు. జీవితంలో ఒక అంతిమ లక్ష్యం లేదా పరమార్థం లేకపోవడం వల్ల మనసు కలవరపడుతుంది. భగవద్గీతలో కృష్ణుడు మనం కేవలం ఈ తాత్కాలిక భౌతిక దేహాలం కాదని, శాశ్వతమైన ఆత్మ స్వరూపులమని బోధించాడు. భగవంతుడు మన పరమ శ్రేయోభిలాషి అని, ఆయన ఎన్నడూ తప్పులు చేయడని గ్రహించి, కృష్ణ చైతన్యంతో పనులు నిర్వహించడం వల్ల యువతకు మానసిక ఒత్తిడి తొలగి జీవితానికి సరైన దిశ,
స్థిరత్వం లభిస్తాయి. కృష్ణుడితో తమకు దగ్గరి సంబంధం ఉందని, ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే జీవిత అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకున్నప్పుడు, హృదయంలో, మనసులో లోతైన శాంతి
నెలకొంటుంది. కృష్ణుడితో ఈ అనుబంధాన్ని కొనసాగించడానికి ఒక సులభమైన అభ్యాసం ఏమిటంటే, ప్రతిరోజూ ఈ క్రింది మహా మంత్రాన్ని జపించడం:
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ప్రతిరోజూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించే సాధన (దినచర్య) అలవాటు చేసుకోవడం వలన ఒకరి
జీవితంలో శుభం కలుగుతుంది.
తనకు భక్తితో సమర్పించే ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం’ ఏదైనా స్వీకరిస్తానని భగవద్గీతలో పేర్కొన్నాడు పరమాత్మ. అలా ప్రేమతో నివేదించిన ఆహారాన్ని స్వీకరించడం వల్ల మన చైతన్యం పవిత్రమవుతుంది. ప్రసాద సేవనంలో కేవలం శారీరక ఆకలి తీరడమే కాకుండా, భగవంతుడి ప్రేమను మనం అనుభూతి చెందుతాం. ఇది ఆత్మకు నిజమైన ఆనందాన్ని, తృప్తిని అందించే ఒక మహోన్నత ఆధ్యాత్మిక సాధన.
‘జన్మ కర్మ చ మే దివ్యం…’ అని కృష్ణుడు చెప్పినట్లు, ఆయన అవతరణ, లీలల దివ్యత్వాన్ని శ్రద్ధగా వినడం వల్ల జీవుడు భవబంధాల నుంచి ముక్తుడై శాశ్వత ధామాన్ని చేరుకుంటాడు. కృష్ణలీలల శ్రవణం వల్ల హృదయంలోని అశుభకరమైన భౌతిక భోగ వాంఛలు, అనర్థాలు తొలగిపోతాయి. పరమాత్మ మన హృదయాన్ని పవిత్రం చేసి, భగవంతుడిపై భక్తిని ప్రసాదిస్తాడు.
-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 96400 86664 ,అధ్యక్షులు, హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్