రండి.. వచ్చి చూడండి. చూసి నేర్చుకోండి. కత్తిరించడం కష్టం కాదు. నేర్చుకుంటే రానిది లేదు. కుట్టు మెషీన్ మీద కాలు పెట్టండి. మీ కాళ్ల మీద మీరు నిలబడండి. పైసలు సంపాదించండి. పదింతలు సంతోషంగా జీవించండి.. అంటూ పేదింటి ఆడబిడ్డల్ని ఆహ్వానిస్తున్నారు రాచకొండ పోలీసులు. పోలీస్ స్టేషన్ ఆవరణలో కుట్టుపని నేర్పుతున్నారు.
చదువు లేదు. పని నైపుణ్యం తెలియదు. ఇంట్లో ప్రోత్సాహం అంతంతమాత్రమే. స్థానికంగా అవకాశాలూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు గోడల మధ్య బతుకీడ్చే మహిళల జీవితాల్ని అధ్యయనం చేయడానికి రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్కే) సభ్యులు పహాడీషరీఫ్, బాలాపూర్లో ఇల్లిల్లూ తిరిగారు. సర్వే చేశారు. సలీమా (షీ టీమ్స్ డీసీపీ), లతా రామసుబ్రహ్మణ్యం (ఇన్ఫోసిస్), పోలీసు అధికారులు నిఖత్, సావిత్రి, వలంటీర్లు జయప్రకాశ్ రాజు, నందిత, కమల్, అమిత్ మరికొందరు ఆ గణాంకాలను విశ్లేషించారు. ఫలితాలు హృదయాలను కదిలించేలా ఉన్నాయి. దాదాపు 1200 కుటుంబాల్లో దారిద్య్రం తాండవిస్తున్నది. ఏ ఇంటికి వెళ్లినా నలుగురు, అయిదుగురు పిల్లలు. సంపాదించేది మాత్రం ఒక్కరే. చిన్న గదిలో గంపెడు కుటుంబం. ఆ పేదింటిలో మగ్గే తల్లులకు ఉపాధి చూపిస్తామని రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భరోసా ఇచ్చింది.
సంకల్పానికి పరీక్ష
ఒక అడుగు ముందుకుపడింది. మరో అడుగు ముందుకేస్తే వాళ్ల జీవితాలూ వేగంగా మారిపోతాయని (అప్పటి) రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ భావించారు. అందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించారు. అమలు బాధ్యత సలీమా (డీసీపీ, షీటీమ్స్), కరుణాకర్ రెడ్డి (షీ టీమ్స్, ఎస్ఐ)కి అప్పగించారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రేకుల షెడ్డు వెలిసింది. అందులో పది కుట్టు మెషీన్లు, కుర్చీలు, లైట్లు, ఫ్యాన్లతో ‘ఉమెన్ ఎంపవరింగ్ రూరల్ యాస్పిరెంట్స్ (షీఎరా)’ కుట్టుపని శిక్షణ కేంద్రం సిద్ధమైంది. 4 అక్టోబరు 2022న శిక్షణ మొదలైంది. కుట్టుపని నేర్చుకునేందుకు 36 మంది వచ్చారు. కానీ ఎవరు బోధిస్తారు? శిక్షణ కోసం ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ‘నాలుగు రోజుల్లోనే ఒక రకం దుస్తులు కుట్టడం నేర్పిస్తాం’ అని చెబుతారు ఇన్స్ట్రక్టర్ అమీనా బేగం.
‘మొదటి రెండు రోజులు మార్కింగ్ నేర్పిస్తాం. తర్వాత కత్తిరించడం ప్రాక్టీస్ చేయిస్తాం. ఇక కుట్టడం అనేది మెషీన్ తొక్కినంత సులభం! చక్రం ఎంత స్పీడ్గా తిరిగితే డ్రెస్ అంత తొందరగా రెడీ అయిపోతుంది! ఆ తర్వాత మరో డ్రెస్ కోసం మార్కింగ్ నేర్పిస్తాం. ఇలా కుర్తా, పైజమా, పటియాలా, అంబ్రెల్లా టాప్, జాకెట్లు, పరికిణీలు, గౌన్లు, ఫ్రాక్లు కుట్టడం అలవాటు చేస్తాం. చివర్లో డీఆర్డీఏ అధికారులు టైలరింగ్ టెస్ట్ పెట్టారు. అందరూ పాసయ్యారు!’ అని మొదటి బ్యాచ్ ముచ్చట్లు చెప్పారు అమీనా బేగం. ఉత్తీర్ణులకు సర్టిఫికెట్తోపాటు ప్రభుత్వమే ఉచితంగా కుట్టు మెషీన్లు ఇచ్చింది! వాళ్లంతా ఇప్పుడు ఇంటి దగ్గరే నాలుగు రూపాయలు వెనకేసుకుంటున్నారు.
చిన్న కుటుంబం..
కుట్టుపని శిక్షణ కోసం వచ్చే యువతుల కుటుంబాల్లో.. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, పెయింటర్లుగా పనిచేస్తున్నవారే ఎక్కువ. కొంతమంది వీధి వ్యాపారులూ ఉన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 16 మందిలో అమ్రీన్ బేగం ఒకరు. ఆమె పహాడీ షరీఫ్లో ఉంటున్నది. పదో తరగతి పాసైంది. పెళ్లి తర్వాత చదువు ఆగిపోయింది. భర్త సంపాదన కుటుంబ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోతుంది. ఇరుకిరుకు గదిలో ఉంటున్నారు. ఇంటి దగ్గరే టైలరింగ్ పని చేసుకోవడానికి వాళ్లాయన ఒప్పుకొన్నాడు. క్లాసులకూ పంపిస్తున్నాడు. ఇప్పుడామె సంతోషానికి హద్దుల్లేవ్! ‘మా బంధువుల్లో ఆడవాళ్లెవరూ సంపాదనా పరులు కాదు. నాతోనే మొదలు. నేను కూడా సంపాదిస్తాను కాబట్టి పిల్లల్ని బాగా చదివించు కుంటా. మంచి ఇల్లు కట్టుకుంటా. నన్ను చూసి మా ఆడబిడ్డ కూడా నేర్చుకోవాలనుకుంటున్నది.
వచ్చే బ్యాచ్లో చేరతానని చెప్పింది. మా పిల్లకు టైలర్ పని వచ్చని మా అమ్మ అందరితో సంతోషంగా చెప్పుకొంటున్నది. రేపు నా పిల్లలు కూడా అంతే సంతోషంగా ఉంటారు’ అంటూ అమ్రీన్ బేగం మురిసిపోతున్నది! ఆడవాళ్లూ పని చేస్తే వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు పేదింటి కష్టాలు తీరిపోతాయని మగవాళ్లూ ప్రోత్సహిస్తున్నారు. కారు చీకట్లలో కాంతి రేఖలాంటి ‘షీ ఎరా’ ప్రభావం మొదలైంది! వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుందన్నట్టు.. నస్రీన్ బేగం గడప దాటి కుట్టు మెషీన్ మీద కాలుపెట్టింది. ‘కుట్టు పని నేర్చుకున్న తర్వాత.. మళ్లీ కాలేజీకి వెళ్తాను. బాగా చదువుకుని డాక్టర్ అవుతా’ అంటున్నది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ జీవితంలో ఎదగాలనిపించిందట. పది పాస్ అయింది. ఆమె అన్నయ్య ఈ మధ్యే దుబాయ్ నుంచి వచ్చాడు. తన సాయంతో కాలేజీకి వెళ్లి చదువుకుంటానని నస్రీన్ చెప్పింది. తొలి బ్యాచ్ కొన్ని జీవితాలను మార్చింది, రెండో బ్యాచ్ కూడా అనేక జీవితాల్లో వెలుగులు నింపింది. ఇక మూడో బ్యాచ్ వంతు. కుట్టుపని, పట్టుదల.. రెండూ ఉంటే ఇక తిరుగేముంది. ఆర్థిక విజయం దిశగా తొలి అడుగే.